పుట:Shodashakumaara-charitramu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii

జక్కనకవి విక్రమార్కచరిత్రమును సిద్ధనమంత్రికిం గృతి యిచ్చెను. సిద్ధనమంత్రి పెద్దతండ్రి వెన్నెలకంటి సూర్యుఁ(భాస్కరుఁ) డని గ్రంథమునం దెలుపఁబడినది. (౧-౬) ఈ సూరనమంత్రి రెడ్డి వేమనరపాలునిచే నగ్రహారముఁ గొనియెనఁట. మఱియు ననపోతారెడ్డికి వెన్నెలకంటివంశజుఁ డగు మఱియొకకవి కృతుల నిచ్చె నని విష్ణుపురాణములోఁ గలదు. వీరికిని అన్నయ్యకు నెట్టిసంబంధమైన నున్నదో లేదో తెలిసికొనుటకుఁగాని మఱి యేవిషయమును దెలిసికొనుటకుఁగాని కృత్యాది పద్యములు దొరకలేదు.

కవికాలము: ఇందుఁ గవి తనకృతిభర్త యగునన్నయ్యను, కృష్ణకందార, భోజ, జగదేకమల్ల, సోమేశ్వరులతో (7-188) బోల్చియున్నవాఁడు. భోజుఁడు ధారానగరాధిపతి. జగదేకమల్లుఁడు పశ్చిమచాళుక్యచక్రవర్తి. వీరు పదునొకండవ శతాబ్దమువారు. సోమేశ్వరుఁడు భూలోకబిరుదాంకితుఁ డగు పశ్చిమచాళుక్యచక్రవర్తి (A. D. 1126-88). ఇతఁడు సంస్కృతమున నభిలషితార్థచింతామణి యను మానసోల్లాసమును రచించెను. ఇతనికి సర్వజ్ఞభూపుఁ డనుబిరుదు కలదు. కృష్ణకందారుఁడు యాదవరాజు. జైత్రపాలుని తనయుఁడు. పదుమూఁడవశతాబ్దమున సూక్తిముక్తావళికర్త యగు జహ్లణకవిని వేదాంతకల్పతరుకర్త యగు నమలానందుని బోషించెను. కాన నీగ్రంథము పదుమూఁడవ శతాబ్దానంతరము రచియింపఁబడియుండును.