శ్రీరస్తు
సత్య హరిశ్చంద్రీయము
షష్ఠాంకము
(రంగము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము)
(పిమ్మట గాలకౌశికుని శిష్యులగు కేశవ జనార్దనులతో లోహితాస్యుడు ప్రవేశించుచున్నాడు)
(గేయము - పార్శీమెట్టు)
అందరు - ఆటలాడుదమా చెండ్లాటలాడుదమా వాటమైన త్రొక్కుడు బిళ్ళాటలాడుదమా ॥ఆట॥ చెట్టులెక్కుదమా లేక గుట్టలెక్కుదమా అట్టు నిట్టు జీగురుబండలందు జాఱుదమా ॥ఆట॥ కూఁత వెట్టుచు దాగిలిమూత లాడుదమా ॥ఆట॥ ఆతరువు క్రింద గోలిలాటలాడుదమా ॥ఆట॥
లోహి - మిత్రులారా!
గీ. ఆటలకు వేళలేదు సాయంతనంపు టగ్నిహోత్రములకు వేళయయ్యె నిప్పు డయ్యవారలు ముక్కోపులగుట మీకుఁ దెలియునేకద రండు దర్భలను గోయ.
కేశ - జనార్దనుడా! పాపము! లోహితాస్యుని కీనాడెన్ని దెబ్బలు తగిలినవిరా! అందుకే వీఁడు భయపడుచున్నాడు.
జనా - మనలను గూఁడ గొట్టునేమో రండు. తలకొకదారిం బోయి దర్భలఁ బత్రములఁ గోయుదము. (అట్లు చేయుచున్నారు)
లోహి - (నడచి పూలఁగోసి) ఈ పూలతావి చక్కగా నున్నది. ఇవి మా కాలకంటికై తీసి కొనిపోయెదను. ఇదిగో నీ పుట్టమీద దర్భలు బాగుగా బెరిఁగినవి. అందరి