Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

95

జీవించెడు పేదసంసారములో రెండణాలు ఉత్తరమునకు చెల్లింపవలె నన్నచో నెంతకష్టమో చెప్పవలెనా? పోష్టలురేట్లవలన వచ్చెడి అధికాదాయములో చాలాభాగ మీకష్టజీవులకు చెందునదే. తక్కిన తపాలా రేట్లెట్లున్నను సర్వజనోపయోగరకమగు కార్డు కవరుల ధర లెప్పటిరేట్లకు మార్చుట ప్రజాహితము గోరెడి ప్రభుత్వమువారి కనీసధర్మము. కాని ఈ వత్సరము గూడ ప్రభుత్వమువారు తపాలారేట్లను తగ్గించుటకు నిరాకరించిరిగదా! కల్పలతా! యాత్రావిషయములు దెల్పుటలో తపాలారేట్ల గొడవయేమిటని నవ్వుచుంటివా? ప్రస్తావ వశమున వచ్చెను గాని ప్రస్తుతాంశ మది గాదని యెఱుగక పోలేదు. మే మంతట మోటారుబండి నెక్కి నాగరుకోయిలకు వచ్చి అచ్చటినుండి వేఱొకబస్సుమీద తిరునల్వేలికి వెళ్లితిమి. అప్పటికి దాదాపు రాత్రి పదిన్నరగంట లయ్యెను. ఇన్నివందల మైళ్లు రైలుప్రయాణము గావించితిమి కాని ట్రివేండ్రము నుండి కన్యాకుమారికి అచ్చటనుండి తిరునల్వేలివఱకు చేసిన కొద్దిపాటి మోటారుబస్సు ప్రయాణములో మేముపడిన శ్రమలో వీసమైన రైలుప్రయాణమువలన పొందలేదని దృఢముగా జెప్పవచ్చును. ఆమోటారుకారు డ్రైవరులయు కండక్టరులయు దురాశలును, దుస్తంత్రములును, దౌర్జన్యములును, నగౌరవక్రియలును, జన్మమున్నంతవఱకు మఱువరానివి. మొదట చెప్పెడు లెక్క బల్లకు అయిదుగురు ఆఱుగురు అని. పురబాహ్యమునకు పోగనే ఆ అయిదుగురిలెక్క పదుగురుగా మాఱును. వీరు డబ్బిచ్చి శ్రమపడెడి దురదృష్టపు ప్రయాణికులు. ఇఁక పోలీసు