Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇబ్ని ఖల్టూన్

సంగ్రహ ఆంధ్ర


1. సంఘమునందు దృశ్యమానములగు వ్యవస్థలన్నియు ఒకే విధమగు సాంఘిక సూత్రములకు లోబడి యున్నట్లు కనబడును.

2. ఈ సాంఘిక సూత్రములు జనబాహుళ్యము పై ప్రభావము కలిగియుండును. ఇక విడివిడి వ్యక్తులు చేయు కార్యఫలితములు కొంచెమెచ్చుతగ్గుగా ఉపేక్షింపదగినవే.

3. బహుళ సంఖ్యలో సంఘటనాంకములను సేకరించి వాటి ఏక కాల సంభూతిని, వాటి పరిణామములను పరిశీ లించినచో ఈ సాంఘిక సూత్రములు ప్రకాశమానము లగును.

4. సదృశమైన సాంఘిక వ్యవస్థగల సంఘములలో ఒకేవిధమగు సాంఘిక సూత్రములు కొంచెము ఇంచుమించుగా గోచరించును.

5. ఒక తెగలోని భిన్న వర్గములు, భిన్న ప్రజల నడుమ ఏర్పడిన సంపర్కము మూలముగ ఆ సంఘస్వరూపము మార్పునకును, పరిణామమునకును పాల్పడుచుండును. ఇది సమ్మిశ్రణమునకును నూతనాచారముల యుత్పత్తికిని దారితీయును.

6. ఈ సాంఘిక సూత్రములు కేవలము జీవప్రేరణ ఛాయలుగావు. అవి ప్రధానముగా సాంఘిక స్వభావాన్వితము లయి యుండును.

ఇబ్ని ఖల్టూన్ ప్రతిపాదించిన మరియొక ముఖ్య సిద్ధాంతము మానవజాతియొక్క సంఘనిర్మాణముమీద శీతోష్ణస్థితి ప్రభావము కలిగి యుండు ననుట. ఇచ్చట గమనించదగిన విషయ మేమనగా ఈ సిద్ధాంతము బోడిన్ మహాశయునిచే పునరుద్ఘాటింపబడి, తరువాత "మాంటెస్క్యు" మహాశయునిచే పరిపుష్టముచేయబడుటకు నాలుగు శతాబ్దములకు పూర్వమే ఇబ్ని ఖల్డూన్ చే ప్రతిపాదితమయి యుండెను. ప్రపంచములోని వివిధ మానవసంఘముల చరిత్రమునుండియు, జంతుప్రపంచమునుండియు ఉదాహరణములనిచ్చి, తన హేతువాదమును, ఇబ్ని ఖల్దూన్ సమర్థించి యున్నాడు. భూమధ్య రేఖకు సమీపమందు నివసించువారు అత్యుష్ణపు బాధకు లోనయి అభివృద్ధి రంగమున ప్రతిబంధకముల పొలగుట తప్పదని అతడనెను. తద్విరుద్ధముగా సమశీతోష్ణ భూఖండములందు నివసించే జనులే సభ్యతకు, సంస్కృతికి ఎక్కువగ తోడ్పడి యున్నారు. వీరే బహుళప్రయోజకము లగు భౌతికశాస్త్రములను, లలితకళాశాస్త్రములను రచించి యున్నారు. చరిత్రలో ప్రముఖస్థానము నందిన మహాశయులును ఇచ్చటివారే.

ఇబ్ని ఖల్ధూన్ యొక్క రాజకీయ సిద్దాంత మూలసారమునకు అతడు "అసాబియాత్" అని పేరు పెట్టినాడు. ఈ పదమునకు గణచిత్తము (Group mind) అని అర్థము. రాష్ట్రమునందు పెక్కు జనసముదాయము లుండును. వీనిలొ ఒక్కొక్క గణమునకు వేరు వేరు సాముదాయక చిత్తముండును. దీనికే అతడు " అసాబియాత్" అని పేరిడెను. విశిష్టమైన అసాబియాత్ కల కేంద్రప్రభుత్వ మేర్పడనంతవరకు ఈ చిన్న గణములు ఒక దానితో నొకటి పోరాడు చుండును. చివరకు వానిలో నొకటి విజయవంతమగును. ఇబ్ని ఖల్దూన్ ఎదుట దేశ దిమ్మరుల యొక్కయు, స్థిరత్వము చెందిన సంఘముల యొక్కయు చరిత్ర యుండెను. వారి వారి ప్రత్యేక గుణగణములను పృథక్కరణముచేసి మొదటివారు (సంచార జనులు) తమ తెగ యెడ బంధుభావము కలిగి యుండుటచే స్థిరనివాసులకంటె వారి గణచిత్తము (Group mind) బలిష్ఠ మైనదిగా అతడు తీర్మానించెను. అదేవిధముగా, నగరములలో నివసించువారికంటె పల్లెలలో నివసించువారు సహజమైన ఏకీభావ తత్వము కలిగి యుందురు. పట్టణవాసులు శాంతిజీవనమునకు అలవాటు పడెదరు; వారు బద్ధకస్థులుగానుండి, తమ ఆస్తిని, తమ మాన మర్యాదలనుకూడ కాపాడే విషయము ఇతరులకే వదలెదరు. ప్రాజాపత్యము వహించిన సంఘము యొక్క సాముదాయక చిత్తవృత్తి రూపముగానున్న కేంద్రగణ చిత్తము వాసి చెడినప్పుడు నాయకుని యందే ప్రభుత్వాధికారములు సంక్రమించుదశ సంప్రాప్తించును. ఈ నాయకుడు రాజయి, రాష్ట్ర పాలనాధికారిగా భావింపబడును. అతని ఆజ్ఞలే దేశపు చట్టములుగా నగును. కాలము గడువగా ప్రజలు పూర్ణముగా అవినీతిపరులగుదురు. అంత పాలకుడు విదేశీ యాధి పత్యము నుండి రాజ్యమును గాపాడుటకై జీతగాండ్లగు సైనిక భటులపయి ఆధారపడవలసి వచ్చును. అంతిమ కాలము వెన్వెంటనే వచ్చును. ఇంతవరకును ప్రక్క దేశాల జనులకు