Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇటలీ (చరిత్ర)

సంగ్రహ ఆంధ్ర

పరాభవమునొందెను. ఈ పరిస్థితులలో మాజినీ యువ ఇటలిసంఘమును స్థాపించి తన రచనల ద్వారమునను, ఉపన్యాసముల ద్వారమునను ప్రజలలో జాతీయ చైతన్యమును ప్రజ్వలింపజేసెను. ఇటలీ ఐక్యమునకు తాత్త్వికపు పునాదులు వేసినవాడు మాజినీ.

సార్డీనియా రాజగు విక్టర్ ఎమాన్యూలు, ప్రధాన మంత్రి కవూరు ఇటలీని ఐక్యము చేసి, ఆస్ట్రియా నుండి విముక్తి సాధింప సంకల్పించిరి. రాజనీతియందు చాణక్యుని బోలినవాడు కవూరు. ఆస్ట్రియా నోడించుటకు విదేశ సహాయ మవసరమని గ్రహించి కవూరు క్రిమియా యుద్ధమున (క్రీ.శ. 1854) ఫ్రాన్సు, ఇంగ్లండుల పక్షమువహించి పారిస్ "సమావేశములో ఆ దేశముల సానుభూతిని సంపాదించేను. ఫ్రెంచిచక్రవర్తియగు మూడవ నెపోలియను ఇటలీకి సైనిక సహాయము చేయుటకుగూడ సమ్మతించేను. కవూరు చర్యల ననుమానించిన ఆస్ట్రియా, సార్జీనియా పై యుద్ధము ప్రకటించెను. (క్రీ.శ. 1859) ఫ్రాన్సు సహాయముతో కవూరు ఆస్ట్రియా నోడించెను. కాని యుద్ధము పూర్తి కాక పూర్వమే నెపోలియను, ఆస్ట్రియా, సార్డీనియాల మధ్య విల్లా ఫ్రాంకోసంధి నేర్పాటుచేసెను (క్రీ. శ. 1859). ఆ సంధి ప్రకారము సార్డీనియాకు లొంబార్డీ ఒసగబడెను. ఈ యుద్ధానంతరము మధ్య ఇటలీలోని టస్కనీ, మొడేనా, పార్మా, రోమగ్న రాజ్యముల ప్రజలు తమ ప్రభువులను పారద్రోలి, సార్థీనియాతో (క్రీ.శ. 1860) చేరిరి. . క్రీ. శ. 1881 లో సిసిలీలో విప్లవము చెలరేగెను. “గారిబాల్డి” యను మహాయోధుడు తన వేయిమంది ఎఱ్ఱ చొక్కాల దళముతో సిసిలీ, నేపుల్సుల నాక్రమించి విక్టర్ ఎమాన్యూలునకు సమర్పించెను. స్వార్థరహితమగు దేశభక్తి కిది చక్కని నిదర్శనము. రోము, వెనీషియీలు తప్ప తక్కిన ఇటలీ యంతయు ఐక్యమైనది. క్రీ. శ. 1861 లో విక్టర్ ఎమాన్యూలు "ఇటలీ రాజు" అను బిరుదమును ధరించెను.

ఆస్ట్రియా ప్రష్యాలకు క్రీ.శ. 1866 లో యుద్ధము సంభవించెను. అందు ప్రష్యా పక్షమువహించి ఇటలీ ఆస్ట్రియానుండి వెనీషియాను బడసెను. క్రీ. శ. 1870 లో ఫ్రాన్సు ప్రష్యాల మధ్య ఒక యుద్ధము జరిగేను. ఫ్రెంచి చక్రవర్తి 3వ నెపోలియను రోమునందు పోపు రక్షణమునకై యుంచిన సేనను ఉపసంహరించెను. సమయము కనిపెట్టి, ఎమాన్యూలు రోము నాక్రమించెను. ఇంతటితో ఇటలీ ఐక్యము పూర్తియైనది. రోము ఇటలీకి రాజధానియైనది.

ఇటలీ క్రీ. శ. 1870_1914: రాజకీయైక్యము సాధించిన తరువాత ఇటలీ ఆర్థికమున అభివృద్ధిచెందెను. అనేక పరిశ్రమలు నెలకొల్పబడెను. విద్యాసంస్కరణలు జరిగెను. క్రీ. శ. 1900 నాటికి ఆధునిక పారిశ్రామిక రాజ్యములలో నొకటిగా ఇటలీ పరిగణింపబడినది. పరిశ్రమలతో బాటు జనాభా పెరుగుటచేత వలస లేర్పరచుటకై ఇటలీ సంకల్పించెను, ఉత్తరాఫ్రికాలోని ట్యునీషియా నాక్రమింప సంకల్పించి, ఇటలీ ఫ్రాన్సుచే పరాభవింపబడెను. ట్యునీషియాను ఫ్రాన్సు అక్రమించుటచే ఇటలీ, పగ సాధించు నుద్దేశముతో జర్మనీ ఆస్ట్రియాలతో చేరి, త్త్రెరాజ్య కూటమిని (Triple alliance) ఏర్పరచెను. తరువాత ఇరిట్రియా, సోమాలిలాండులను ఇటలీ ఆక్రమించెను. అబిసీనియాను జయించుటకు ప్రయత్నించి (క్రీ.శ. 1896) పరాజయమందెను. ఈలోగా ఇటలీలో ఆస్ట్రియాపై ద్వేషము ప్రబలసాగెను. ఇంకను ఆస్ట్రియా పాలనలో ఇటాలియను ప్రాంతమైన ట్రింటినో ఉండిపోయెను. దాని నాక్రమింపవలెనని జాతీయవాదులు పట్టుబట్టిరి. క్రీ.శ. 1902 లో ఇటలీని ట్రిపోలిని ఆక్రమించుటకు ఫ్రాన్సు సమ్మతించుటచేత ఇటలీ ఫ్రాన్సు దేశములు సన్నిహితములు కాజొచ్చెను. క్రీ. శ. 1911 లో టర్కీ నోడించి, ట్రిపోలిని ఆక్రమించి ఇటలీ దానికి లిబియా అని పేరిడెను.

మొదటి ప్రపంచ యుద్ధము : ఈ యుద్ధమున ఇటలీ కొంతకాలము తాటస్థ్యము వహించి యుండెను. క్రీ.శ. 1915 లో లండను సంధి యనంతరము ఇటలీ, మిత్రమండలి పక్షమున పోరాడెను. మొదట ఓడిపోయినను, చివరకు ఇటాలియనులు ఆస్ట్రియాను నిట్టోరియోవెనిటో యుద్ధమున పూర్తిగా నోడించిరి.

'ట్రిస్పి, ఫ్యూమ్, డాల్మేషియాల నాశించిన ఇటలీకి శాంతిసమావేశమున ఆశాభంగము కలిగెను. డాల్మేషియాలో చాల భాగము యుగోస్లావియాకు ఈయబడెను.