Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండపల్లి

సంగ్రహ ఆంధ్ర

ద్రావిడ కుటుంబములవారు ఇటనుండి వెడలిపోయిరి. కాని ఈ గ్రామము చిరకాలము బొమ్మకంటి, వారణాసి, అప్పల్ల, వంగల మొదలగు వంశములందు ఉద్భవించిన షట్ఛాస్త్ర పండితులకు నిలయమై యుండెను.


కొండపల్లి :

కొండపల్లి యాంధ్రదేశమున కృష్ణామండల మందలి బెజవాడ తాలూకాలోని గ్రామము. ఈ గ్రామమునకు పడమటి దిశయందు దుర్గారణ్య పరివృతమగు పర్వతము గలదు. ఇది యున్నతమైన పర్వతము; దక్షిణమున కృష్ణా నదివరకును, ఉత్తరమున కొండూరు, జుజ్జూరుల వరకును పరివ్యాప్తి గలది. దీని కై వారము నూరుమైళ్ళు, ఎత్తు రమారమి రెండు మైళ్ళు. ఈ పర్వత ప్రాంతము క్రూర మృగములకు నివాసస్థానము. చోరుల కాటపట్టు. జన సంచారమునకు భయావహము.

అనాది నుండి కొండపల్లి గ్రామము మెత్తని చిత్ర విచిత్రపు కొయ్య బొమ్మలకు పెట్టినది పేరు. ఈ కొండపల్లి బొమ్మల శిల్పచాతుర్య మనల్పము. కుటీర పరిశ్రమలకు నిలయము. చాలకాలము వరకు కొండపల్లి కాగితపు పరిశ్రమ ప్రసిద్ధిలో నుండెను. దీని జనసంఖ్య క్రీ. శ. 1951 నాటికి 6212. ఇందు పురుషుల సంఖ్య 3161, స్త్రీలసంఖ్య 3051 మంది. రెడ్డి ప్రభువుల నిర్మాణములగు ప్రాచీన శివాలయ, వీరభద్రాలయములు నేటికిని ఆంధ్ర భక్తుల నాకర్షించుచున్నవి. మహమ్మదీయుల పండుగలు జరుగుటకు 'గవ్వలగుట్ట' యను నొక చిన్న గుట్టయు గలదు. ఈ గుట్ట వెన్నుదన్ని యే విద్యాధర గజపతివారి చెరు వున్నది. కొండవీడు రాజ్యములో నైదు బలిష్ఠ దుర్గము లుండెను. అందు కొండపల్లి దుర్గము చేరియుండెను. కొండవీడు, వినుకొండ, బెల్ల (బిల) ముకొండ, నాగార్జు(నుని)న కొండ అనునవి ఇతర నాలుగు దుర్గములు. ఈ పంచగిరి దుర్గములే గాక కొండవీటి రాష్ట్రమునకు మొత్త మెనుబదినాలుగు దుర్గము లుండెడివి. ఇంత పెద్ద దైన కొండవీటి రాష్ట్రము మహమ్మదీయుల పరిపాలనమునకు లోబడినపుడు, కేవలము కొండవీడు, కొండపల్లి యను రెండు సర్కారులుగా మాత్రము విభజింపబడినది. మహమ్మదీయులు కొండపల్లి సర్కారును “ముస్తఫా నగర"మని పేర్కొనిరి. కొండవీటి సర్కారు నుండి పాములపాడు, గద్దంరావూరు, మద్దూరు, ఉండవల్లి, ఉప్పుమాగులూరు, ధరణికోట, పెనుమాక, రాయపూడి, తాడేపల్లి గ్రామములు కొండపల్లి సర్కారులో కలిసినట్లు “జై నినాగభట్టు" తన “దండకవిలె"లో చెప్పినాడు (క్రీ. శ. 1250 సంవత్సరము).

కొండవీటి రెడ్డిరాజులకు మూలపురుషు డగు కోమటి ప్రోలయ వేమారెడ్డి (1326-1353) కొండపల్లిగ్రామమునకు సమీపముననున్న “కవులూరు" అను గ్రామ నివాసిగా నుండె ననియు, ఇతడు గొప్ప భూస్వామిగా నుండి యుండెననియు, ఈత డొక బ్రాహ్మణునివలన స్పర్శవేధి సంపాదించి భాగ్యగరిమ చేతను, బాహాబలసంపద చేతను ప్రతాపరుద్రుని యొద్ద దండనాథుడుగ ప్రబలెననియు తెలిపెడు నై తిహ్య మొకటి కలదు.

కవులూరు గ్రామ వాస్తవ్యుడగు కోమటి ప్రోలయ వేమారెడ్డియే పుట్టకోటలుగా నున్న కొండవీడు, కొండపల్లి దుర్గములను ప్రధానదుర్గములుగ నిర్ణయించి కోటల నిర్మాణమునకు బూనుకొనెనని జనశ్రుతిగలదు. ఈకోమటి ప్రోలయ వేముడు కవులూరు నుండి కొండపల్లి కిని, కొండపల్లి నుండి కొండవీటికిని క్రమముగ నివాసములను మార్చుకొనుచు కోటల నిర్మాణములను బూర్తి గావించెను.

కొండపల్లి దుర్గము కృష్ణాతీరమునకు ఐదుమైళ్ళ దూరమునందున్నది. దీనికి రెండుమైళ్ళ క్రిందిభాగమున నొక కోట ప్రాకారము కలదు. దీని చుట్టుకొలత పండ్రెండు మైళ్ళు. చుట్టును ప్రాకారమున్నది. ఈ పర్వత ప్రాకారము నంటియున్న కోటకు దిగువ నలువైపులయందును కందకముగూడ ఒకటి గలదు. కందక మెల్ల వేళల పారు చుండెడు సెలయేటి ప్రవాహములచే పుష్కలోదకమై యుండును. క్రింది ప్రాకారమునకును, దుర్గమునకును ఒక మైలు దూరముండును. ఈ మైలు దూరములోనే దుర్గ ప్రవేశమునకు రెండుదారులు కలవు. అందొకటి రాచబాట రెండవది రాళ్ళబాట.

రాచబాట చతురంగ బలముల రాకపోకలకు వీలు కలది. రాళ్ళబాట రహస్యమార్గము. ఇది సంకట సమయము నందు దుర్గములోనివారు ప్రాణ రక్షణార్థమై పారి పోవుటకు నుపయోగపడునట్టిది.

46