కేశవ జగన్మోహినీ ఆలయము
సంగ్రహ ఆంధ్ర
వీథికి ఇరుకొనలందును ఎదు రెదురుగా కేశవస్వామి యాలయమును, కమండలేశ్వరస్వామి యాలయమును నిల్చియున్నవి. ఈ గ్రామమున క్షేత్రపాలకుడగు వేణుగోపాలస్వామియు చిరకాలము క్రిందటనే వెలసియున్నాడు. పెద్ద మెట్టవీథులతోను, కొన్ని చదునగు పల్లపు వీథులతోను గూడిన ఈ గ్రామము నేడు స్వామి దర్శనమునకు వచ్చు ప్రముఖ భక్తుల కారణమునను, వ్యవసాయము, వర్తకము మొదలైనవి పెరుగుటచేతను, కాలువలును, రహదారులును, వంతెనలును గలిగి రాజుకీయముగ గూడ ప్రాముఖ్యము నొందు పెద్ద గ్రామముగ నొప్పుచున్నది. వేలకొలది విద్యార్థు లిటకు విజ్ఞానయాత్రల కొరకు ఏటేట వచ్చుచున్నారు.
ఆంధ్రదేశ చరిత్రలో తూర్పు చాళుక్యరాజులు వేంగి ముఖ్యపట్టణము గాను, పశ్చిమ చాళుక్యరాజులు కళ్యాణపురము రాజధానిగాను, క్రీ. శ. ఏడవశతాబ్ది నుండియు నేలుచు, నిరంతరము పరస్పర యుద్ధములలో మునిగి యుండిరి. ఆ కాలమున దక్షిణమున తంజాపురి ప్రాంతమున చోళరాజ్యము విలసిల్లెను. చోళరాజులు తూర్పు, పడమటి చాళుక్యులతో వివాహ సంబంధములు చేసికొని, తూర్పు చాళుక్యుల కెక్కువ సహాయము చేయుచుండిరి. క్రీ. శ. 1022 నుండి 1063 వరకు రాజమహేంద్రవరమున రాజ్యమేలిన రాజరాజ నరేంద్రుని పెక్కుమార్లు అతని సవతి తమ్ముడగు విజయాదిత్యుడు పడమటి చాళుక్య రాజుల సహాయమున ఓడించి సింహాసన భ్రష్టుని జేయగా, రాజేంద్ర చోళుడను రాజు దక్షిణమునుండి వచ్చి రాజరాజును రాజమహేంద్రవర రాజ్యమున పునస్థాపితుని చేయుచుండెను. రాజేంద్ర చోళుడు తన కొమార్తె, అమ్మంగదేవిని రాజరాజునకిచ్చి పెండ్లిచేసెను. ఈ దంపతుల పుత్రుడు రాజేంద్ర కులోత్తుంగ చోళు డన బరగెను. ఈతడు చోళరాజుల దౌహిత్రు డగుటచేతను, అప్పటి చోళరాజులగు వీర రాజేంద్రచోళుడు చనిపోవుటయు, ఆతని కొడుకు అధిరాజేంద్రుడు యుద్ధమున చనిపోవుటయు, అట్లు చోళ సింహాసనము రాజహీన మగుటయు తటస్థింపగా చాళుక్య, చోళ రాజ్యములు రెండింటికిని తానే వారసుడయ్యెను. అంతకుముందు రాజ్యకాంక్షచే విజయాదిత్యుడు (కులోత్తుంగుని సవతి పినతండ్రి) వేంగి రాజ్యముపై డీకొనగా కులోత్తుంగుని రాజ్యమున నిల్పుటకు అప్పటి చోళరాజగు వీర రాజేంద్ర చోళుడు దక్షిణమునుండి దండయాత్రవచ్చి, విజయాదిత్యునికి సాయపడుటకు బెజవాడ వరకును వచ్చిన పడమటి చాళుక్య రాజగు ఆరవ విక్రమాదిత్యు నోడించి, రాజమహేంద్రవరమునకు వచ్చి, విజయాదిత్యునిగూడ తరిమి, కులోత్తుంగుని మరల ఆంధ్ర సింహాసనమున నిల్పెను. కాని కులోత్తుంగుడు చోళ రాజ్యముననే ప్రీతి కలిగి తన ఇద్దరు శత్రువులతోను సంధి చేసికొని, తన కొమాళ్ళను వేంగిరాజ్య మేలుటకు నిల్పి, తాను చోళదేశమున నిలిచిపోయెను. ఇతడు క్రీ. శ. 1118 వరకును జీవించెను. ఇట్లు రాజరాజ నరేంద్రునికిని అతని కొడుకు కులోత్తుంగునికిని సహాయము చేయుటకు మాటి మాటికిని చోళరాజులగు రాజేంద్ర చోళుడు, వీరేంద్రచోళుడు మొదలగువారు సైన్య పరివారములతో రావలసి వచ్చుచుండెను. ఈ చోళ రాజులు వేంగిరాజ్య రక్షణార్థము వచ్చినప్పుడు వారివెంట కుంభకోణము, వెలంగ మాను మొదలగు ప్రాంతములందలి ద్రవిడ బ్రాహ్మణులు, ఆంధ్రదేశమున నివసింపదలచి, తమ కుటుంబములతో గూడ పండ్రెండు గోత్రముల వారు వచ్చి ఈ యుభయ గోదావరీ మధ్యస్థమగు ర్యాలియందు నివాస మేర్పరచుకొనిరి. ఆ ద్రావిడులు శిల్ప నైపుణ్య ముట్టిపడు సుందరతమ సాలగ్రామశిలానిర్మితమగు జగన్మోహినీ కేశవస్వామి విగ్రహమును ఒక రథముపై నుంచుకొని దానిని ద్రోసికొని వచ్చుచుండగా, రథపు చీల రాలిపడెను. మరియొక చీల అతికి రథమును జరుపజూచినను రథము కదలలేదు. స్వప్న దర్శనాదులచే స్వామి సంకల్పముగూడ నచట నిల్చి పోవుటయే యని భక్తు లెరిగి, ఆ విగ్రహము నచటనే ప్రతిష్ఠించిరి. రథము చీల రాలి, స్వామి యట నెలకొనుటచే అచ్చటి వారాగ్రామమునకు ర్యాలియని పేరిడిరట. ద్రావిడ చోళరాజుల బిరుదమున 'గండ' పదము కలదు. రాజేంద్ర చోళునికి 'ఒక్కెత్తు గండ' (యుద్ధమున నొకే కేతువుగల ఏకైక వీరుడు) బిరుదము కలదు. అభ్యుదయ గండచోళుడు కేశవస్వామిఆలయమును కట్టించెనని, పెద్దలు చెప్పుదురు. ఈ అభ్యుదయ గండబిరుదము పదునొకండవ శతాబ్దాంతప్రాంత చోళరాజులకు చెందియుండును.
44