Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేశవ జగన్మోహినీ ఆలయము

సంగ్రహ ఆంధ్ర

అత్యంత సన్నిహితసంబంధము గలిగిన మహర్షి, బ్రహ్మానందుల మధ్య ధర్మసాధనమును గూర్చిన అభిప్రాయ భేదములు ఏర్పడుటచే, వారు వేర్వేరుమార్గము లవలంబించిరి. బ్రాహ్మధర్మము హిందూధర్మ సంస్కరణ మని మహర్షి భావించెను. అది సర్వమత సంప్రదాయముల నవలంబించిన విశ్వజనీన ధర్మమని కేశవచంద్రుడు నిర్ధారణ చేసెను. 1862 సం. న "శ్లోక సంగ్రహ” మను గ్రంథమును ప్రకటించినపుడు పండిత గౌరీ గోవింద రాయలు రచించిన ఈ క్రింది శ్లోకమును ఆ గ్రంథము యొక్క ముఖపత్రమునందు కేశవచంద్రు డచ్చొత్తించెను :


శ్లో. సువిశాల మిదం విశ్వం, పవిత్రం బ్రహ్మ మందిరం
    చేతస్సునిర్మలం తీర్థం, సత్యం శాస్త్రమనశ్వరం.
   విశ్వాసో ధర్మమూలంహి, ప్రీతిః పరమ సాధనం
   స్వార్థనాశస్తు వై రాగ్యం, బ్రాహ్మైరేవంప్రకీర్త్యతే.

ఈ సువిశాల విశ్వధర్మము ననుసరించి కేశవచంద్రుడు, ఇతర అభ్యుదయ బ్రాహ్ములు, తమ తమ వ్యక్తి సమష్టి జీవితముల సంస్కరించుట కారంభించిరి. “సాధు సమాగమము” “సర్వ మతగ్రంథ సామరస్యము” వారికి సాధన విషయము లయ్యెడివి. బాల్యము నుండియు కేశవుడు విశేషముగా ప్రార్థనాశీలుడు. ఈశ్వరుని స్నేహితునివలె ముఖాముఖి చూచుట, కష్టసుఖముల నాతనితో నివేదించుకొనుట అతని కలవాటు. మానవ హృదయ మాక్రందనముచేయ ఈశ్వరు డాకర్ణించు ననియు, కరుణాళువగు ఈశ్వరుని వాణిని విని మానవుడు శిరసావహించుననియు కేశవచంద్రునికి అచంచలమైన విశ్వాసముండెను.

ఈశ్వర దర్శనము త్రివిధములచే ప్రాప్తించునని కేశవచంద్రుడు ప్రబోధించువాడు. ఆత్మ జీవితము నందును, ప్రకృతి చిత్రముల యందును, మానవకోటి యోగక్షేమములందును ఆయనను దర్శింపనగును. వేదాంతయోగము, వైదికయోగము, పౌరాణిక యోగమని ఆతడు వాటికి నామకరణము చేసెను.

సర్వధర్మ సమన్వయ సాధనమును కేశవచంద్రుడు ప్రతిష్ఠించెను. యథార్థ బ్రహ్మోపాసకుడు సోక్రటీసు యొక్క మేధస్సును, జీససు యొక్క హృదయమును, చైతన్యుని యొక్క జిహ్వను, మహమ్మదు యొక్క ఉత్సాహమును, హోవర్డు (Howard) సంబంధమైన ధైర్య శీలమును- అన్నిటిని సమన్వయముచేసి, సమగ్ర జీవితమును పొందునని కేశవచంద్రుని దృఢవిశ్వాసము.

సర్వధర్మ సంప్రదాయములును ఎక్కడి కక్కడ సత్యములే. విశాల, సమగ్ర, విశ్వజనీన సంప్రదాయము నందు వాటిని సమన్వయము చేయుట ఆత్మాభివృద్ధికి ప్రధానము. అది బ్రహ్మోపాసకుని కర్తవ్యము.

బ్రహ్మానంద రసపానముచే మత్తతచెందిన బ్రహ్మానంద కేశవ చంద్రసేనునకును శ్రీరామకృష్ణ పరమహంసకును మధ్య అత్యంతము ఆధ్యాత్మికమైన మైత్రి పొసగుట యం దాశ్చర్య మేమున్నది! ఇరువురును ఉగ్రమైన సాధన సంపత్తిగలవారలే. ఇద్దరును జగజ్జనని సందర్శనానందమున నోలలాడినవారే. విశ్వజనని సాన్నిధ్యమున ఆనంద పారవశ్యముచే పరస్పరాలింగనము చేసికొనుచుండిరన్న “భక్తానాందళ మేకమ్” అనియే అనుకొనవలసినది. సిద్ధాంతము లందలి భేదములచే కలహించునది సామాన్యులు. దర్శన భాగ్యముచే జనించిన ఆనందముచే భక్తులు కరచాలనముచేసి నృత్యము సల్పుదురు. అట్టివారి యందు ప్రేమయు, వినమ్రభావము అనునవే కాని ద్వేషము, అసహనము అనునవి గోచరింపవు.

కేశవచంద్రుడు భక్తాగ్రేసరుడు. ఏకేశ్వరోపాసనను వ్యాప్తికి దెచ్చుటకై, అంతరాత్మ ప్రబోధమును జీవిత సూత్రముగా ప్రతిష్ఠించుటకై, సర్వమత సమన్వయమును సాధించుటకై, విశ్వమానవ సౌభ్రాత్రము నెలకొల్పుటకై యావచ్ఛ క్తిని వినియోగించి, సార్థకజీవియైనవాడు. భారతరత్నము. సమగ్ర మానవుడు.


కేశవ జగన్మోహినీ ఆలయము (ర్యాలి) :

రాజమహేంద్రవరమునకు సుమారు పదునైదు మైళ్లు దక్షిణమున గౌతమి, వసిష్ఠ యను గోదావరి పాయలకు మధ్యమున 'ర్యాలి' యను పురాతన గ్రామమున్నది. ఈ యూరు వేయి యేండ్లకు పూర్వము నౌకలమీద రత్నముల వ్యాపారము చేయు వర్తకులకు నిలయమై రత్నాపుర మను పేరున నుండెడిదట. జగన్మోహినీ కేశవస్వామి ఇట ప్రతిష్ఠింపబడిన నాటి నుండియు 'రాలి' యను పేరున బరగి ఇప్పుడు 'ర్యాలి' యనబడుచున్నది. క్రీ. శ. పదునొకండవ శతాబ్ద్యంతమున, శ్రీ కేశవస్వామి

42