Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కేరళదేశము (భూగోళము)

9. కన్ననూరు 22,265 చ. మై. 13,75,081

1958 సంవత్సర లెక్కలను బట్టి కేరళ జనసంఖ్య 1,52,30,000

ప్రధాన నగరములు :

నగరము విస్తీర్ణము జనసంఖ్య
1. తిరువనంతపురము 17.00 చ.మై. 1,86,931
2. క్విలన్ 6.15 చ.మై. 66,126
3. అలెప్పీ 12.50 చ.మై 1,16,278
4. కొట్టాయం 6.25 చ.మై 44,204
5. చెంగన్‌చెర్రీ 5.50 చ.మై. 36,289
6. మట్టన్‌చెర్రీ 2.69 చ.మై. 71,904
7. ఎర్నాకులం 3.37 చ.మై. 62,283
8. త్రిచూరు 4.78 చ.మై. 69,515
9. పాల్ఘాట్ 10.27 చ.మై. 69,504
10. కోఝికోడ్ 11.8 చ.మై. 1,58,724
11. కన్ననూరు 4.88 చ.మై. 42,431
12 తెల్లిచెర్రీ 3.00 చ.మై. 40.040
13. కొచ్చిన్‌పోర్టు 1.01 చ.మై 29,881

వాతావరణము : పల్లపు ప్రాంతములందు వాతావరణము వేడిగాను, నిమ్నోన్నత ప్రదేశములందు ఆరోగ్య కరముగాను, చల్లగాను, ఉన్నతగిరి ప్రదేశములందు శీతలముగాను ఉండును. F90° కంటె ఉష్ణప్రమాణ మెక్కువగా నుండక పోయినను, ఉక్కగానుండి, పల్లపు ప్రాంతములలో అధికముగా చెమటపట్టు చుండును. సాగర, నదీ జలములు ఎల్లెడల ప్రవహించు చుండుటచేతను, కొబ్బరి, రబ్బరు, పోక, జీడిపప్పు, వరి పొలములు, టోపియోకా అను కర్రపెండలము పండు భూములు మున్నగునవి ఎల్లప్పుడు పచ్చగా నుండుటచేతను, ప్రకృతి సౌందర్యాతిశయ సంపన్నమై అలరారుచు, 'దక్షిణ కాశ్మీరము' అని ప్రఖ్యాతి వహించినది కేరళము.

'వర్షపాతము : మే నెల తుదిలోనో, లేక జూన్ నెల మొదటనో గర్జారావ సహితముగా దక్షిణ పశ్చిమ వర్షాగమన మారంభించి సెప్టెంబరు వరకు వానలు కురియు చుండును. తిరిగి అక్టోబరులో ఉత్తర పూర్వ వర్షాకాల మారంభించి, డిశెంబరునెల తుదివరకు సాగి పిదప కాలము విప్పును. జనవరి, ఫిబ్రవరి మాసములు చల్లగా విప్పారి యుండును. మార్చి, ఏప్రిల్, మేనెలలు వేసవికాలము కేరళము యొక్క అధికాంశ భాగమున వర్షములు అధికముగా కురియును. కొట్టాయం జిల్లాయొక్క ఉన్నత పర్వత పక్తులలో 200 అంగుళములవరకు వర్షములు కురియును. కేరళముయొక్క వివిధ ప్రాంతములలో వర్షపరిమాణము మారుచుండును. తిరువనంతపురములో సగటున సంవత్సరమునకు 64 అంగుళములును, క్యాలికట్, కోఝికోడు ప్రాంతములలో 118 అంగుళములును వర్ష పరిమాణ ముండును. వర్షాభావమువలన కలుగు నష్టము కంటె, అతివృష్టివలన కలుగు నష్టమే అధికము. సంపూర్ణమైన అనావృష్టిని కేరళ రాష్ట్రము ఎరుగదనయే చెప్ప వచ్చును.

నేల : భూమియొక్క వైవిధ్యమునుబట్టి కేరళమును మూడు తరగతులుగా విభజింపవచ్చును.

(1) సముద్రమునకు అతి సమీపముగా నున్న పల్లపు భాగము.

(2) మధ్యభాగమున గల నిమ్మోన్నత ప్రదేశము.

(3) రెండవ భాగమునకు తూర్పున కనుమలను ఆనుకొనియున్న అడవులుగల అత్యున్నత భూభాగము .

సముద్రతీరమునకు సమీపముననున్న పల్లపుప్రదేశము లందు కొబ్బరితోటలు, వరిపంట విస్తారముగా పండును. మధ్యభాగమున చిన్న గుట్టలు, లోయలు వ్యాపించి యున్నను, ఈ ప్రాంతమందే సేద్యమునకు అనువగుభూమి ఎక్కువగా కలదు. ఉన్నత ప్రదేశములు గల పర్వత భూభాగములందు విశేషముగా తేయాకు, కాఫీ, ఏలకుల తోటలు గలవు. అంతకంటె నిమ్న భాగములందు మిరియములు, అల్లము, రబ్బరు, పసుపు మున్నగు పదార్థములు పండును. అడవులు వన్య వృక్ష మృగజాతులకై ప్రసిద్ధి గాంచినవి.

భూమి పంపిణి : కేరళరాష్ట్రములో భూమి ఈ క్రింది విధముగా పంపిణీ చేయబడియున్నది:

అటవీ ప్రాంతము 24,32,644 యెకరములు
సాగుచేయబడిన మొత్తము ప్రాంతము 54,65,424 యెకరములు
పంటలుపండు నికరపు వైశాల్యము 44,76,877 యెకరములు

39