Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కేరళదేశము (చరిత్ర)

పేర్కొనదగినవి. 'మరుమక్క తాయమ్' పద్ధతి ప్రకారము వారసత్వపుహక్కులు ఆడపిల్లల సంతతికి చెందును. క్షత్రియులు, అంబలవాసులు (దేవాలయ సేవకులు) సామంతులు, నాయర్లు, కొందరు ఇఝవాలు లేక తియ్యాలు, కొందరు ముస్లిములుకూడ ఈ యాచారమునే పాలించుచుండిరి. పాతిక సంవత్సరములక్రింద శాసనముల ద్వారా కొన్ని మార్పులు జరిగినవి. పార్లమెంటుచే నంగీకృతమైన హిందూవారసత్వపు శాసనముల వలన ఈ కేరళీయాచారము దాదాపు సమసిపోవుచున్నది. కేరళదేశమునందలి సంయుక్తకుటుంబ (Joint-Family) పద్ధతి ఇతరప్రాంతములందలి పద్ధతికంటె భిన్నమయినది. ఈ పద్ధతి ప్రకారము కుటుంబములోని వారందరు అవి భక్తులుగా కుటుంబము యొక్క అగ్రజుడగు పురుషుని (కార్నవన్ = ధర్మకర్త) అధీనములో నుండవలయును. గత నాలుగు శతాబ్దములనుండి కుటుంబములోని వ్యక్తులకు ఆస్తివిభాగమునుగోరి పంచుకొనుటకు అధికారము శాసనముల వలన లభించినది.

పై నుదహరించిన ఆచారముల కనుబంధమగు మరియొక వివాహపద్ధతియు కేరళలో ప్రచలితమైయుండెను. దానినే “సంబంధమ్" అని వ్యవహరించు చుండిరి. ఈ వివాహ సంబంధము రెండు విధములుగా నుండెను. కేరళీయ నంబూద్రి (నంబూరి) బ్రాహ్మణ కుటుంబములలో బుట్టిన అగ్రజునికి మాత్రము సవర్ణయగు బ్రాహ్మణితో వివాహము జరుగుటయు, అతనికే ఆస్తి యంతయు దక్కుటయు, కుటుంబములోని ఇతర పురుషులందరు వర్ణేతరులైన “నాయర్" స్త్రీలతో పై “సంబధ” వివాహములు చేసికొనుటయు ఆచారముగా నుండెడిది. ఆ విధముగా నంబూద్రి కుటుంబములు ప్రాయశః 'జన్మీ' (jenmi) అను భూస్వాముల తెగగా మారినవి. అట్లే నంబూద్రీలకు “నాయర్" స్త్రీలయందు కలిగిన సంతానము బ్రాహ్మణ సంస్కృతి నలవరచుకొని క్షత్రియుల స్థాయిని బొంది సాంస్కృతికముగా బ్రాహ్మణుల కంటె ఏ మాత్రము తీసిపోని పాండిత్యమును సంపాదించెను. ఇతర ప్రాంతము లందలి శూద్రులవలె గాక కేరళీయ నాయరులలో వేదశాస్త్రాది ప్రాచీన విద్యా వై దుష్యమును, వంస్కారమును ఇప్పటికిని గొప్ప స్థాయిలో గలదు. దీని ముఖ్యకారణము పై వివాహ సంబంధమే యనుట నిర్వివాదము. ఈ పద్ధతి ప్రకారము భార్య తన పుట్టింటి యాస్తి ననుభవించుచు, అక్కడనే కాపుర ముండుటయు, భర్త తన యింటిలో నుండియే భార్య యింటికి రాకపోకలు మాత్రముచే దాంపత్యజీవన మనుభవించుటయు ఆచారమైనది. నంబూద్రీ -నాయర్ సంబంధములో ఏకగృహవాసము వర్ణభేదము వలన పొసగనందున ఈ పద్ధతి ఆరంభమైనది. కాని అదియే సత్సంప్రదాయముగా, సదాచారముగా నాయర్‌లలో స్వవర్ణ వివాహము లందును స్వీకరింపబడినది. ఇప్పటికిని భార్యా భర్తలు వేర్వేరు గృహములందు నివసించుట గలదు. ఈ యాచారము యొక్క వ్యాప్తికి స్త్రీలు పూర్వము నుండియే వారసత్వపు హక్కులు గలిగియుండుట వలన దోహదము కలిగినది. నంబూద్రీలతో పై విధముగ వివాహము చేసికొను పద్దతి మూడు దశాబ్దముల క్రింద నిషేధింప బడినందున 'సంబంధ' వివాహ పద్ధతి నశించినది. ఇప్పుడు భార్యలు తమ భర్తలతో ఏకగృహవాసము చేయుటయే తరచుగ కనిపించును. ఈ కేరళీయ ప్రత్యేకాచారములు అఖిలభారతీయ వ్యాప్తిగల హిందూ లా సంస్కరణ శాసనమువలన దాదాపు నిరవశిష్టముగా అంతరించినవని చెప్పుట అతిశయోక్తి కాదు.

'నాయర్'ల వివాహ సంస్కార పద్ధతిమాత్ర మింకను ప్రత్యేకమును, విశిష్టమునై యున్నది. ఈ వివాహపద్ధతికి ఇతర ప్రాంతములలో ప్రచలితమైన యాచారములతో నెట్టి సంబంధమును లేదు. వేదశాస్త్రాదులలో విధింపబడిన ఏ మంత్రతంత్ర విధాన మవసరము లేదు. కన్యాదానము మంగళసూత్రధారణము, హోమాదులు, సప్తపది మున్నగునవి ఏవియు వీరి ఆచారమున లేవు. బంధు మిత్రాదులు సమావేశమైన సభయందు వేదికపై ఆసీను డయిన వరుని సముఖమునకు వధువు సానుచరయై హారతి తీసికొనివచ్చి నిలుచుండును. వరుడు సిద్దముగా నుంచబడిన పళ్ళెమునందలి తెల్లని వస్త్రమును (చీరను) లేక పట్టుపుట్టమును వధువున కందిచ్చును. వధువు దానిని స్వీకరించును. పిదప వధూవరులు పెద్దలకు నమస్కరించి, దేవతాదర్శన మొనర్తురు. ఐదు నిమిషములలో ఈ వివాహ మహోత్సవము ఇట్లు సంపూర్ణ మగును. భార్య

33