కేరళదేశము - (చరిత్ర)
సంగ్రహ ఆంధ్ర
యొక పక్షము వహించుటయు, ఇంతలో ఇతర పాశ్చాత్యులు మలబార్ రంగములో ప్రవేశించుటయు, మైసూరు సుల్తానులు కొన్ని మలబారురాజ్యములను గెల్చుటయు వెనువెంటనే రక్తపాతముతో యుద్ధములు చెలరేగుటయు వాటి ఫలితముగ చిన్న చిన్న రాజ్యములలో ఒకటివెంట నొకటి అంతరించుటయు, సంభవించెను. 1792 వ సంవత్సరములో బ్రిటిషువారి సాయమును పొందిన తిరువాన్కూరు సంస్థాన సైన్యములను టిప్పుసుల్తాను ఎదుర్కొనవలసిన వాడయ్యెను. అనంతరము జరిగిన ఒడంబడిక ప్రకారము టిప్పుసుల్తాను మలబారు ప్రాంతమును బ్రిటిషువారి కప్పగించెను. జామోరిన్ కుటుంబమువారు కౌలుపత్రముల క్రింద భూములపై తమ పెత్తనమును, అనుభవించుచు వచ్చిరి. అనంతరము ఇతర రాజులతోపాటు జామోరిన్ అను నాతనికిగూడ శాశ్వతమయిన పెన్షను మంజూరు చేయబడినది.
క్రీ. శ. 1792 వ సంవత్సరము నుండి కేరళములో బ్రిటిషు అధికారము ప్రారంభమయ్యెను. కేరళ చరిత్రము విదేశీయ పాలకులను ప్రతిఘటించిన వీరోచితమయిన గాథగా ప్రస్తుతి గడించినది.
ఈ విధముగా కేరళదేశము చేరరాజుల ఆధిపత్యమున ఏక పరిపాలనాబద్ధమై పెక్కు శతాబ్దముల కాలము విలసిల్లెను. తరువాత కాలప్రభావమున చారిత్రకముగ పెక్కు మార్పులకు అది గురి యయ్యెను. కేరళరాజ్య విస్తీర్ణము హెచ్చుచు, తగ్గుచు వచ్చెను. ప్రతిభాశాలియైన చేరమాన్ పెరుమాళ్ అను కడపటిరాజు తరువాత అది మరికొంత విభజనకు పాలయ్యెను. ఇటీవలి చరిత్రకాలములో పైన నుడివిన ప్రకారము కేరళము మూడు ప్రత్యేక రాష్ట్రములుగ రూపొందెను. భారతీయ రాష్ట్రముల పునర్నిర్మాణ సందర్భమున 1956 సంవత్సరము 1 వ తేదీ నవంబరునాడు భాషా మూలకముగను, సాంస్కృతికముగను ఏకసూత్ర బద్ధముగా వెలయుటకు కేరళరాష్ట్రము నిర్మాణమాయెను. ఇట్లు చిరకాలాగతముగా నుండిన మలయాళీలవాంఛ ఫలించినది.
ఆచార వ్యవహారములు : కేరళీయులు తమిళులకంటె తెలుపైన చామనచాయ గలిగి అవయవ సౌష్ఠవముతో నొప్పారుచు శుభ్రమైన దుస్తులను ధరించి నిరాడంబరము పరిశుభ్రము అగుజీవనమునకు అలవడినవారు. స్త్రీపురుషులందరు ప్రాయశః తెల్లని వస్త్రములను ధరింతురు. ప్రతి దినము కాకపోయినను వారములో తరచుగా శిర స్స్నానము చేయనివారుండరు, తైలాభ్యంగనము స్త్రీ పురుషులకుకూడా నిత్యమగు దేశాచారము. కేరళీయ స్త్రీల వ్రేలాడు శిరోజములు సుప్రసిద్ధములని రఘువంశ శ్లోక మొకటి చాటుచున్నది. మళయాళ స్త్రీలు బట్టకట్టు విధము ఆయా జాతులనుబట్టి మారుచుండును. నాయరు స్త్రీలు తెల్లని 'వుడువ' రౌక (రవిక), ఉత్తరీయము ధరించువారు. క్రైస్తవ స్త్రీలు 'వుడువ' ను నడుముపై చిన్న కుచ్చులు వ్రేలాడునట్లు ధరించెదరు. తిలకము లేక పోవుటయు, ఈ కుచ్చులను ధరించుటయు, వారు హిందువులు కారనుటకు చిహ్నములు. ముస్లిం స్త్రీలు (మలబారు మోప్లాలు) రంగుల దుస్తులు ధరింతురు. కాని తలపై ముసుగు గుడ్డలను వేసికొనెదరు. పురుషులు ముండు అను పంచెను ధరింతురు. షర్టును వేసికొందురు. తలగుడ్డ ప్రసక్తిలేదు. ఈ పద్ధతులు గత నాలుగైదు దశాబ్దములనుండి మారిపోయినవి. నేడు ఇతర భారత స్త్రీలవలె రంగుల చీరలు, రవికలు సాధారణముగా నాగరికులలో దినదిన ప్రచార మొందుచున్నవి. పురుషులలో ఆంగ్లేయ పద్దతి కోటు పంట్లాము ధరించుట వ్యాప్తి నొందుచున్నది. కాని కాళీయులందరును, కనీసము పురుషులందరు ఒకేమాదిరి దుస్తులు ధరించుట వలనను, ఒకే భాషను మాట్లాడుచుండుట వలనను, కొన్ని ఇతర ప్రాంతములందువలె వారి జాతిమత భేదము అంతగా బాహ్యదృష్టికి గోచరముకాదు. తిలకముధరించుట హైందవులగు పురుషులలో అరుదై పోయినందున ఈ భేదము మరింత కానరాని దని చెప్పవచ్చును. స్త్రీలు పూర్వకాలమందు చెవులు, ముక్కులు, కంఠము, తల, కాళ్లు, చేతులు, నడుము మున్నగు సర్వావయవములకు బరువగు రకరకాల ఆభరణములను ధరించువారే కాని ఇపుడా యభ్యాసము సన్నగిల్లి ఇతరప్రాంతములందు వలెనే వారును ఆధునిక నాగరిక స్త్రీలవలెనే మెలగు చుందురు.
కేరళముయొక్క ప్రత్యేక దేశాచారములలో "మరుమక్క తాయమ్" మరియు సంయుక్త కుటుంబపద్ధతులు
32