Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కెప్లర్

రించు కేంద్రములు. వర్షము తక్కువగాగల ప్రదేశములు పశువుల పెంపకమునకు పనికివచ్చుచున్నవి.

3. పడమటి కెనడా: బ్రిటిష్ కొలంబియా, యూకన్ పీఠభూమి, వాంకూవరుదీవి ఇందు కలవు.. ఇది పర్వత ప్రాంతము. కొలంబియాలో రాగి, బంగారు, నికెలు, వెండి, ఇనుము దొరకును. తీరము 'సామను' జాతి చేపలుపట్టు కేంద్రముగా ప్రసిద్ధిగాంచినది.

ముఖ్య పట్టణములు : కెనడా దేశమునకు అట్టావా రాజధాని. దీని జనాభా 2,02,045 మంది. మాంట్రియల్ జనాభా 10,21 520 ; వాంకోవరు జనాభా 3,44,833 ; క్విబెక్ జనాభా 1,64,016; హాలిఫాక్స్ జనాభా 1,62,217; ఇవి కెనడా దేశములోని ముఖ్య రేవు పట్టణములు. టారెంటో, విన్ని పెగ్, హామిల్టన్, ఎడ్‌మంటన్ పట్టణములు ముఖ్య పారిశ్రామిక కేంద్రములు.

వృత్తులు : కెనడాదేశమందు వ్యవసాయమే ముఖ్యవృత్తి. ఉద్యాన కృషి, పశువుల పెంపకము, కోళ్ళ పెంపకము మున్నగునవికూడా ఇందు చేరిఉన్నవి. దేశముయొక్క మొత్తపు (36,19,616 చ.మై) వైశాల్యములో 15.2 శాతము సేద్యపుభూమియైయున్నది. ప్రపంచములో గోధుమ ఎక్కువగా ఎగుమతిచేయు దేశములలో కెనడా ఒకటి. ఓట్సు, బార్లి కూడా ఇచటి ముఖ్య సస్యములు. ఆపిల్ పండ్లు చెరకు, పొగాకు, తేనె మొదలగునవి కూడా ఈ దేశమందలి ముఖ్యమగు ఉత్పత్తులు.

కెనడాలో గనులు, ఉక్కు, కలప, రబ్బరు మున్నగు పరిశ్రమలు ఇతర వృత్తులు. ముడిసరకులు బ్రిటిష్‌ దీవుల కెగుమతి చేయబడును. పారిశ్రామిక వస్తువులు కూడా ఇతరదేశముల కెగుమతి చేయబడును. దేశమందు అనేక రైలుమార్గములును, జలమార్గములును, వాయుమార్గములును కలవు. భాగ్యవంతమగు దేశములలో కెనడా ఒకటి. ఈ దేశమున జల విద్యుచ్ఛక్తి అత్యధికముగా నుండుటచే అది పారిశ్రామికవృద్ధికి ఎంతయు తోడ్పడుచున్నది. గోధుమలు, ఇతర ధాన్యములు, అచ్చుకాగితము (న్యూస్ ప్రింటు), యంత్రసామగ్రి, కఱ్ఱగుజ్జు, కలప ఈ దేశమునందలి ప్రధానమయిన ఎగుమతులు. యంత్ర శకటములు, పెట్రోలియము, ఇనుము, ఉక్కు యంత్రములు ఇచటికి దిగుమతి చేయబడుచున్నవి.

జనులు: 1952 వ సం. లో ఈ దేశమునందలి జనాభా 1,44,30,000 మంది. వీరిలో బ్రిటిషువారు 48%; ఫ్రెంచి వారు, 31%.జర్మనులు, యుక్రేనియనులు కూడా కొలదిమంది కలరు. మొత్తము జనులలో 43% రోమను కాథలికులు ; 20% యునై టెడ్ చర్చికి చెందినవారు ; మిగిలినవారు ఇతర మతస్థులు.

విద్య : ఇచట 14 సం. ల లోపుగా పిల్లలకు ఉచితముగా నిర్బంధవిద్యయొసగబడును. దేశమందు 6 ప్రభుత్వ విశ్వవిద్యాలయములును, 12 ప్రభుత్వేతర స్వతంత్ర విశ్వవిద్యాలయములును కలవు. వాటిలో టారెంటోలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయము, మాంట్రియల్ లోని స్వతంత్ర విశ్వవిద్యాలయము ప్రధానమైనవి.

ఎం. వి. రా.


కెప్లర్ (1571-1630) :

జొహాన్ కెప్లర్ గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఇతడు జర్మనీ దేశమున వుర్టెంబర్లులోవీల్ అను ప్రదేశమున క్రీ.శ. 1571 వ సంవత్సరము డిసెంబరు 27 వ తేదీన జన్మించెను. ఈతని తండ్రి పేరు హెన్రీకెప్లర్; తల్లి కాథరీన్ గుల్డెన్ మాన్. కెప్లర్ వారి పెద్దకుమారుడు. ఇతని బాల్యమున తలిదండ్రుల దురదృష్టము, దుర్నడతవలన కొన్ని చిక్కులు కలిగెను. వాటితోబాటు ఇతని నాల్గవఏట స్ఫోటకము తగిలి, చేతులు చొట్టపోయి, దృష్టి శాశ్వతముగా చెడిపోవుటగూడ తటస్థించినది. అతడు 1577 వ సంవత్సరములో లియాన్ బర్గు పాఠశాలలో ప్రవేశించెను. 1584 లో ఎడెల్ బర్గులోనున్న మతసంబంధమగు పాఠశాలయందును రెండు సంవత్సరముల తరువాత మాల్ బ్రోన్‌లో నున్న పాఠశాలయందును కెప్లర్ కాలము గడిపెను. పట్టపరీక్షలో గొప్పగా నుత్తీర్ణుడగుటచే, 'టుబిన్ జన్' విశ్వవిద్యాలయమున ప్రవేశింపగలిగి, కెప్లర్ ఆ విశ్వవిద్యాలయమున తన గురువుగను, జీవితాంతమువరకును స్నేహితుడుగను ఉన్న మై కేల్ మిస్ట్లిన్ అనునాతనియొద్ద కొపర్నికస్ సూత్రములను చక్కగా నేర్చుకొనెను. 1594 వ సంవత్సరమున అతడు గ్రాట్జ్ అనుచోట ఖగోళశాస్త్రాచార్య పదవిని స్వీకరించెను.

కెప్లర్ ఖగోళశాస్త్రముపై దృష్టినుంచుకొని మొదట టాలెమీ, కార్డన్ అనువారు ఏర్పరచిన సూత్రములలో

9