Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖడ్గతిక్కన

తన సైన్యమంతయు వీరశయనము నొందగా తిక్కన దండనాథు డొక్కడే రణరంగమున నిలిచెను. ఈ విప్ర వీరుని శరీరమునుండి రక్తధారలు ప్రవహించుచుండెను. అత డత్యంతము బడలికచెంది యుండెను. ఇతని అశ్వ రాజము గూడ క్షతగాత్రయై జవసత్వము లుడిగినదాయెను, అయినను పిరుతివియక తిక్కన పోరాడుచునే యుండెను. అప్పుడు కాటమరాజు పక్షమున సేనాపతి యగు పిన్నమనాయడు ఎలుగెత్తి యిట్లనెను :


"పోరు నిల్పఁగదోయి ! భూసురోత్తముడ!
సరిగాదు మాతోను సమరంబు సేయ
నగ్రజన్ములు మీరు యాదవుల మేముఁ
ఉగ్రంబు మామీద నుంచంగ రాదు
తరతరముల తాత తండ్రులు మేము
భట్టుల బ్రాహ్మల వైష్ణవో త్తముల
వెట్టిచెరల్ మాని వెనుక వేసికొని
ప్రాణా లొసఁగి కీర్తి ప్రబలియున్నాము
కడకు బ్రాహ్మణహత్య కట్టుకోరాదు
ఆమీద నెఱుగుదు వన్నియు నీవు
భూమీశు డెఱుగని పోరు నీకేల?"

అని అతని నివారింప, తిక్కన తన సైన్యమంతయు హతమై యుండుటకు విచారించి, ఒక నీతిమార్గము తలచి మరల సైన్యముతో ఎదురుకొనవలయు నని నిశ్చయించి పురమునకు తిరిగిరాగా, పురజనులు చప్పట్లు కొట్టుచు, కేకలు వేయుచు గేలిసేయ దొడగిరి.


"తాటాకులను మోసి తగ వ్రాయఁగాని
చెలఁగి యుద్దము సేయఁ జేత నేమౌను
ఎదిరించి నిలిచిన హెచ్చు సేనలను
సరి సేయ నవి యజ్ఞ శాలలు గావు
అరులపోటులుగాని యక్షతల్ గావు
చనుదెంచు చక్రాలు చక్కిలాల్ గావు
ఘన చక్రబాణాలు గారెలు గావు
అర్చిదూసెడు కత్తు లరిసెలు గావు
పొడిచేటి బల్లెముల్ పూర్ణములుగావు
కుంతముల్ రుచిఁ బప్పుగూరయుఁ గాదు
కమ్మనిపాయసము కాదు కయ్యంబు
వండిన యా పిండి వంటయుఁ గాదు
బంటుతన మే యూరు బ్రాహ్మఁ డే యూరు."

అనుచు ప్రజలు హాస్యము చేసిరి. ఈ మాటలను సరకు చేయక తిక్కన యింటికి పోయెను. ఇతని రాక తండ్రి యగు సిద్ధనామాత్యునకు చాల విచారము కలిగించినది. అందుల కతడు


"కొడుక ! యీ వంశంబు కడుదొడ్డ దోయి
పెద్ద కాలమునాడు పేరుమోసినది
పులికడ్పునను గొఱ్ఱె పుట్టు చందమునఁ
గలిగితి నాయింతి గర్భంబునందుఁ
జదువున శాస్త్రాన సాహసమందుఁ
దిక్కన! నీసాటి ధృతి లేరనంగ
సాహసంబున వారి సాధింపబోయి
యింతగా వెన్నిచ్చి యిటువలె రాను
మగతనంబున బుట్టి మగవాడ వనుచుఁ
బగతుకు వెన్నిచ్చు ప్రాణం బదేల ?
యరులకు నోడి యీయవని మనుకున్న
సరగ రణభూమిలో సమయుట మేలు
పందవుగాని భావజ్ఞుడవు గావు
ఎందుకీప్రాణం బదేల యీ బ్రదుకు.”

అని తూలనాడెను.

ఇక నింటిలో తిక్కన భార్య వీరపత్ని కనుక తన విభుడు పగరకు వెన్నిచ్చి, ఆకలిగొని అలసి వచ్చినాడనుచు


"కడువేగ విభునికి గ్రాఁగిన నీళ్లు
బిందెల చన్నీళ్ళు బిరబిరతెచ్చి
పసిఁడి చెంబుల నీరు పాళాలుచేసి
యక్కడ మంచంబు నడ్డంబు పెట్టి
యద్దశేరు పసుపు నమరంగనుంచి
కూర్చుండి స్నానంబు గొబ్బునఁ జేయుడు.”

అని చెప్పెను. తదుపరి ఆమె యత్తదగ్గరకు వెడలి


"గొబ్బున నీరాడి కూతురు వచ్చుఁ
దీర్చి యడ్డబొట్టు స్థిరముగా బెట్టు
గంధంబు చెక్కిళ్ళ ఘనముగాఁ బూసి
పళ్ళాన నన్నంబు బాగుగాఁ బెట్టుము."

అని అత్తతో విన్నవించె నట. స్నానశాలయందలి ఏర్పాట్లను తిక్కన గమనించెను. ఇదేమి ఇట్లు ఏర్పాటు చేసితి వనగా ఆ వీరపత్ని

177