Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్రపాయనము - మురుగుపారుదల

తమముగనుండి, దానికేంద్రమును ఆ దిక్కుననే ఉండవలయునను ఊహకు తావిచ్చుచున్నది.

క్షీరసాగరమును భ్రమణగతికి లోనయ్యే యున్నది. క్షీరసాగరముకూడ దాని కేంద్రముచుట్టును పరిభ్రమించు చున్నది. అనగా, దానితోపాటు ఈ చుక్కల గుత్తులు, నభోలములు, విడిచుక్కలు అన్నియును ఈ క్షీరసాగరముచుట్టును పరిభ్రమించుచున్నవన్నమాట. సూర్యుని చుట్టును తిరుగు గ్రహములవలెనే, ఈ కేంద్రమునకు దూరముగనున్న నక్షత్రములు, తాము చుట్టిరావలసిన త్రోవ చాల పెద్దదగుటచేతను, కేంద్రమునకు దూరముగ నున్న కారణమున అచ్చటి గురుత్వాకర్షణ తక్కువై గమనవేగము తగ్గుటచేతను, అవి ఒకసారి ఈ కేంద్రమును చుట్టివచ్చుటకు బహు దీర్ఘ కాలముపట్టును. ఈ విధముగ సూర్యుడున్న నక్షత్ర గుచ్ఛము కేంద్రముచుట్టును ఒకమారు తిరిగివచ్చుటకు 22 కోట్ల 50 లక్షల సంవత్సరములు పట్టును. ప్రస్తుతము దీని గమనవేగము క్షణమునకు 180 మైళ్ళు. దీని గమనదిశ రాజహంస మండలము వైపు. అనగా సూర్యునికి రెండు విధములయిన గమనములు కలవు. 1. ఆతడున్న నక్షత్రగుచ్ఛము తనచుట్టును తాను తిరుగుచుండుటచే, దాని కేంద్రము చుట్టును సూర్యుడు తిరుగుచుండును. 2. నక్షత్రగుచ్ఛము క్షీరసాగర కేంద్రముచుట్టును తిరుగుచుండుటచే, దానితోపాటు సూర్యుడును క్షీరసాగరముచుట్టును పరిభ్రమించు చుండును.

గ్రహములలో సూర్యునికి దగ్గరగా నున్నవాటికి ఎక్కువ వేగమును, దూరముగా నున్నవాటికి తక్కువ వేగమును ఎట్లుండునో, అదేవిధముగ క్షీరసాగర కేంద్రమునకు దగ్గరగానున్న చుక్కల వేగము ఎక్కువగా నుండును. లేనిచో అవి కేంద్రమున పడిపోవును. అయితే సూర్యుడు గ్రహములను తన ఆకర్షణప్రభావముచే తన చుట్టును ఏ విధముగ పరిభ్రమింప జేసికొనుచున్నాడో, ఆవిధమగు బలవత్తర ఆకర్షణక్తి గల ఏ యొక వస్తువును క్షీరసాగర కేంద్రమున లేదు. ఇచ్చట నక్షత్రములు, నక్షత్రగుచ్ఛములు అతి సాంద్రముగ నుండుటచే, వాటి సమష్టి ఆకర్షణశక్తివలననే మిగిలిన వన్నియు కేంద్రము చుట్టును పరిభ్రమించుచున్నవి.

క్షీరసాగరము తన కేంద్రముచుట్టును పరిభ్రమించుచుండుటచే, దాని మొ త్తము బరువును కనుగొనవచ్చును. అట్లు కనుగొనగా ఇది సూర్యునికంటె 16×1010 రెట్లు అని తెలిసినది. దీనిలో నభోలములక్రిందను, బొగ్గుసంచుల క్రిందను, నక్షత్ర మధ్యప్రదేశమున నుండు పదార్థము క్రిందను సగము తీసివేసినచో, 8× 10010 సూర్యుల బరువు గల నక్షత్రములు ఈ క్షీరసాగరమున నున్నవన్నమాట. ఈ నక్షత్రముల సగటు బరువు ఒక్కొక్కటి సూర్యుని యంత యుండునని తలచినచో, ఈ క్షీరసాగరమున ఇంచుమించుగా 1011 నక్షత్రము లున్నవని తలచవచ్చును.

బి. వి.


క్షేత్రపాయనము - మురుగుపారుదల :

నీటిపారుదల ఎందులకు అవసర మగుచున్నది? పంటలు పండుటకు వర్షపునీరు చాలనపుడు తక్కువ యయిన నీటిని నదులమూలమున, తటాకముల మూలమున, బావుల మూలమున పొలములకు పారుదలు చేసి సస్యాభివృద్ధికి తోడ్పడవలసి యున్నది. లేనిచో మొక్క యొక్క అభివృద్ధి కుంటువడి, ఫలితము నీరసించును. పంటభూములకు అదనపు నీటిని కృత్రిమముగా అందజేయు విధానము క్షేత్రపాయన మనబడును. (Irrigation).

స్వాభావిక మైన వర్ష జలము ఒక ప్రాంతపు పంట భూములకు చాలినంత లభించినచో, కృత్రిమమైన నీటి పారుదలతో సామాన్యముగా అవసరము కలుగదు. ఉదాహరణమునకు దక్షిణ భారతములో సమయానుకూలముగా పడు వర్షజలము, ఆ ప్రాంతములోని జొన్న, వేరుసెనగ, ప్రత్తి మొదలగు పంటలకు సామాన్యముగా సరిపోవును, ఇవి పండు పొలములను మెరక పొలములనియు, ఈ పంటలను మెరక పంటలనియు వాడుకగా పిలుతురు. దీనినే మెరక సాగనియు లేక మెట్ట వ్యవసాయమనియు అందురు. ఇట్టి భూములయందు నీటిపారుదలతో అవసరముండదు. ఇట్టి పొలములలో పంటలు సాధారణముగా తక్కువస్థాయిలో పండును. నీటి వనరులున్న ప్రదేశములలో అధికతరమైన పరిమాణములో పంటలను ఉత్పత్తి చేయవచ్చును.

నీటి పారుదల విధానములు :

నీటి సరఫరా : నీరు ఉత్పత్తి అయ్యెడి స్థలమునుండి

145