పుట:SaakshiPartIII.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. ఆయుర్వేదవైద్యుని యుపన్యాసము

సాక్షి సంఘసభలో రకరకాల విషయాల గురించి-జంఘాలశాస్త్రి అప్పుడప్పుడు కాలాచార్యులు, ఎప్పుడో ఒకసారి వాణీదాసు, బుద్ధిపుట్టినప్పుడు సాక్షి మాత్రమే ఉపన్యాసాలివ్వడం కాకుండా ఇతర విషయాల మీద కూడా, ఆయా రంగాలకు చెందినవారిచేత మాట్లాడించడం కూడా వుంది.

ఒక ఆయుర్వేద వైద్యుడు ఈసభలో మాట్లాడుతూ-అయినదానికీ, కానిదానికీ శస్త్రచికిత్సలకు ఎగబడే మన దేశీయుల మూర్ఖత్వాన్ని గట్టిగా విమర్శించాడు.

మల విసర్జన విషయంలో బాధ వున్న వారికి-ఆబాధ తీర్చడానికి ఆముదం వుండగా ఎనీమా అనవసరం. పుప్పి పన్నుకు మూలికావైద్యం వుండగా పన్ను పీకించే పద్దతి అనవసరం. అలాగే వ్రణాలలోని క్రిముల్ని బయటకులాగే ఓషధులున్నాయి. ముల్లుగుచ్చుకున్న మనిషి కంటిలో రెండు పసరు చుక్కలు వేస్తే, ఎక్కడి ముల్లు అక్కడ బయటపడే వీలుండగా, ముల్లు పీకడానికి కత్తులు, కఠారులూ ఎందుకు? కాలి బెణుకు ఠక్కున సర్దుకోవడానికి ఆముద వైద్యం వుండగా, ఆకాలు తొలగించవలసిన స్థితి ఎందులకు తెచ్చుకోవాలి? రాచకురుపు హరించడానికి ఒక మూలిక పస రుంది. ఇంజెక్షనులు, టీకాలు ఎంత అసహజాలు? శస్త్రవైద్యం పనికిరాని వ్రణాలెన్నో వున్నాయి. వాటికి ఆయుర్వేదం మందులున్నాయి. స్త్రీలకున్న మలబద్దత హరించడానికి మందులున్నాయి. కడుపులో గడ్డలకీ, గుల్మాలకీ, లోపలికి మందు వాడాలి గాని శస్త్రచికిత్స కాదు. శస్త్రచికిత్సవల్ల కార్యనాశ నమే కాని, కారణ నాశనం కాదు. అందువల్ల దేశీయతను నమ్ముకోవాలి. దేశీయతలో పుట్టి, పెరిగి, మరణించడం ఒక్కటే సరైన దారి అని ముగించాడు వైద్యుడు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.

నేను సభకుఁ బోవుసరికే యొక యాయుర్వేద వైద్యుఁ డుపన్యసించుచుండెను. అంతకుముం దేమి చెప్పియుండెనో కాని నేనునభలోఁ బ్రవేశించినపిమ్మట నాతం డిట్లు పలికెను: