పుట:Ranganatha Ramayanamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాలోచనము

9

పాఠకులే చదివి యానందింతురని మనవి. కవి "అసమాన లలిత శబ్దార్థ సంగతుల… భావనల్నిండ" నని తాను బూనినరీతిని గ్రంథరచన సంపూర్ణముగఁ జేసి కృతకృత్యుఁ డైనాఁడు.

గ్రంథకర్త యింతటి యుత్కృష్టగ్రంథమును ద్విపదకావ్యమునఁ బ్రథమశ్రేణి నాశ్రయింపఁదగినదానిని రచించి, తన కులగోత్రములను, స్థలాదికమును దెలుపక పోవుట తనకుఁగల ప్రభుభక్తియే ప్రధానకారణమని మాటిమాటికిఁ దలంపఁదగును. ఈ గ్రంథము పట్టణములమాట యటుండఁ, గోడిగూసిన ప్రతిగ్రామమునందును గల దనుటకును, బురాణకాలక్షేపముగ నిదియే యాదృతిపాత్రమైన దనుటకును, బొమ్మలాట లాడువారును నిందలి కథాభాగములనే శ్రావ్యముగఁ బాడుచు నభినయించి పేక్షకుల నానందరససాగరనిమగ్నులఁ గావించుచున్నారనుటకును, నీగ్రంథమునకుఁగల మహిమ నిరుపమాన మని వేఱ చెప్పవలయునా?

కవి యిందు శ్రీ మద్ద్రామాయణమున లేని, జంబుమాలివృత్తాంతము, కాలనేమి కథ, సులోచనాచరిత్రము చదువ చదువఁ బాఠకులకు, శ్రోతలకు పరవశత్వమును గలిగించుచున్న వనుటలో వింతలేదు. ఇం దాభాగ మని యీభాగ మని చెప్పఁ బనిలేక సర్వత్ర హృద్యముగ నున్నది.

ఈ గ్రంథమును సరిచూచి (ప్రాఁతతప్పుల పుస్తకమును దిద్ది) యొక పీఠిక వ్రాసి యిమ్మని కడప రాయలు అండు కో వారు కోరగా నశక్తుడ నయ్యు, నిజమాడిన నిష్ఠురము ప్రాప్తించు నని యెఱిఁగియు, నాకుఁ దోఁచిన భావములను నిశ్శంకముగా వ్రాసి యిచ్చితి. తప్పులు పండితులు మన్నింపుఁడు. గ్రంథవిషయమున నెక్కుడుగ వ్రాయవలసిన యంశము లుండియుఁ బ్రకృతము నియమితుఁడనై విరమించితి. రాఁబోవు ముద్రణమున మరలఁ గొంతయవకాశమును బట్టి విన్నవింతు. భాషాసేవకై పూనిన యీ రాయలు అండ్ కో వారి యుద్యమమునకుఁ దోడ్పాటు చూపుట తెలుఁగుదేశమువారి సత్కృతి. వీరికిని, బాఠకులకును శ్రీ రామచంద్రుఁ డాయురారోగ్యభాగ్యములఁ జేకూర్చుఁగాక!

వశంవదుఁడు

శ్రీ లలితావిలాసము

కావ్యపురాణతీర్థ, విద్వాన్,

శ్రీ శ్రీ శ్రీ