పుట:Ranganatha Ramayanamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావ్యము

బాలకాండము

41

యుదకంబు గానకయున్న యయ్యెడకు - సదయుఁడై గరుడుండు సనుదెంచి పలికెఁ.

గంగావతరణకథ

"గపిలుని నలుకమైఁ గలచి యమ్మౌని - కుపితాగ్ని సగరులు కూలి నీఱైరి,
యిది యేల శోకింప? నిటు శోక మంద - నిది వేళగా దొక్క టేర్పడ వినుము.
సరసిజాసనవంద్యచరణారవిందుఁ - డరవిందదళనేత్రుఁ డాదిపూరుషుఁడు
బలిదానవేశ్వరు బంధించునప్పు - డలుక ద్రివిక్రముఁడై నిండఁ బెరిగి.
యగణితశక్తి రెండడుగులయందు - జగతీతలంబెల్ల సరి నాక్రమించి,1210
జలజాతజలచరశంఖచక్రము - లలవడునట్టి మూఁడవపదాంబుజము
కడుకొని బ్రహ్మలోకముదాఁక జాపఁ - గడువేగమున వచ్చి కమలసంభవుఁడు
తలకొన్నభక్తితోఁ దనకమండలువు - జలములఁ దత్పాదజలజముల్ గడిగెఁ.
బొగడొందఁ దజ్జలంబులు నభోవీథిఁ - దగిలి వర్తించు మందాకిని యనఁగఁ,
గావున నీ వింకఁ గమలసంభవుని భావించి తప మతిభక్తిఁ గావించి
కడకమై నాకాశగంగఁ దెచ్చి - తడయక భస్మముల్ తడిపినఁగాని,
పరలోకసుఖములు పడయరు వారు - గురుబుద్ధిఁ దురగంబు గొని యేగు” మనిన
దురగంబు గొనిపోయి తొడరి యంతయును - దరమిడి యాతఁడు తమతాతతోడఁ
జెప్పిన శోకించి చేయఁ గైకొన్న - యప్పుణ్యమఖము సమాప్తంబు చేసి
కామించి యాకాశగంగ నీయుర్వి - కెమ్మెయి దెత్తునో? యే నంచుఁ జింత1220
విడువక ముప్పదివేలేండ్లు తపము - పుడమి నెంతయుఁ జేసి పోయెను దివికి.
నారాజుమనుమఁ డయ్యంశుమంతుఁడు - ధారుణి గంగకుఁ డప మొప్పఁ బూని,
వరుస ముప్పదివేలవర్షము ల్సలిపి - పరలోకగతుఁడయ్యెఁ బదపడి యతఁడు,
అతనిపుత్త్రుఁడు దిలీపావనీనాథుఁ - డతినిష్టతోడ జాహ్నవిఁ దెత్తు ననుచు
విడువక ముప్పదివేలేండ్లు తపము - గడపియు నతఁడు రోగములచేఁ జచ్చె.
ననఘుఁ డాతనిపుత్త్రుఁ డగుభగీరథుఁడు - దనరాజ్య మరయఁ బ్రధానుల నిల్పి
సారధర్మజ్ఞులు సద్గుణోజ్జ్వలులు - శూరులు నగునట్టి సుతులను గోరి,
యెల్లపాపంబుల నిలమీఁదఁ బాపఁ - దెల్లంబుగాఁ గంగఁ దెచ్చెద ననుచుఁ
గరమర్థిఁ దపము గోకర్ణాశ్రమమున - నరుదుగాఁ బదివేలయబ్దము ల్సేయ
ననుపమం బగుచున్న యాతపంబునకు- వనజసంభవుఁ డంత వరదుఁడై వచ్చి1230
యడుగుము వర మన్న నాభగీరథుఁడు - కడుభక్తి బ్రహ్మకుఁ గరములు మొగిచి
“భారతీనేత! ప్రపంచనిర్మాత! - సౌరలోకత్రాత! సత్యసంఘాత!
ధాత! మాతాతలు దగ్ధులై వచ్చి - యాతతకపిలుకోపాగ్నిచేఁ గ్రాగి,
నూఱువేలేండ్లు సన్నుతగతిలేక - నాఱడిపడి భస్మమై యున్నవారు;