పుట:Ranganatha Ramayanamu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వడిఁ బూన్చి దైత్యుఁడు వైచుచునున్న - బెడిదంపుశక్తులు పిడుగులు గాఁగ
నగణితదివ్యశస్త్రావళి యందు - మిగిలినదీప్తులు మెఱుఁగులు గాఁగఁ
బొరిఁబొరిఁ బుంఖానుపుంఖంబు లగుచుఁ - నరుదెంచునమ్ములు నతివృష్టి గాఁగఁ
గరుల నొప్పిన సెలకట్టియ లెల్లఁ దఱుచుగా నాడు చాతకములు గాఁగఁ
గనకరత్నప్రభాకలితంబు లగుచుఁ - దనరు చాపం బింద్రధనువును గాఁగ
నసురులయందును నగచరులందు - వెస గ్రమ్ము నెత్తురు వెల్లువ గాఁగ4650
బింబహారములకు విఱిసిన మౌక్తి - కంబులు నెరి వడగండ్లును గాఁగ
నురులిన మకుటమహోజ్జ్వలమణులు - పరఁగంగ నింద్రగోపంబులు గాఁగ
లాలితాయతకాహళారవంబులును - వ్రాలిన కేకారవంబులు గాఁగ
సమధికపటహోగ్రసన్నాహరవము - రమణీయమండూకరావంబు గాఁగ
నసమున రఘుపతి హలికుఁడై పేర్చు - నసురేశు విపులదేహక్షేత్రమునను
అడరి లోకములెల్ల నలరంగ ముష్టి - విడువక యమ్ములు వెతఁ బెట్టుకొఱకు
వచ్చిన తొలుకరి వానకాలంబు - నచ్చుగా నొప్పారె నాసమయంబు
గానఁ గదా యింకఁ గడఁగి రాఘవుఁడు - మానక బాహుసమగ్రతఁ బూని
కలనికి నద్దశకంఠునిఁ దెచ్చి - తలకోఁత కోసి యుద్దండత నునుచు
ననినచందంబున నతివిచిత్రముగ - నెనయంగ డెబ్బదిరెండువెల్లువల4660
వనచరులను నృపవరుల జయించి - ఘనతరజ్యానాదకలితుఁడై మగిడి
యాలంబు చాలించి యాయింద్రజిత్తుఁ - డాలంకలోనికి నరిగె నవ్వుచును;
మనుజేశుదురవస్థ మది విచారించి - కనుఁగొనఁ జాలక కన్నులు మొగిచి
కొని తొలఁగినమాడ్కిఁ గ్రుంకె నర్కుండు - వనచరాననపద్మవనములు మొగుడఁ
గపికోటిచే లంక కాలుచో ధూమ - ముపమింప నీగతి నుండు నన్నట్లు
కడునగ్గలముగ లోకం బెల్ల నిండి - తడయ కెంతయు నంధతమసంబు పర్వె;

హనుమద్విభీషణులు బ్రహ్మాస్త్రముబాఱిఁ బడక సైన్యమును బరీక్షించుట

నప్పుడు తొడిగి బ్రహ్మాస్త్రమంత్రంబు - లొప్పఁ జపింపంగ నొకటియుఁ గాక
యున్న విభీషణుఁ డుర్వరఁ గూలి - యున్నసుగ్రీవాదియోధులఁ జూచి
"వనచరులార! గీర్వాణారిసుతుఁడు - వనరుహగర్భుని వరమునఁ జేసి
పన్ని యేయుటయును బ్రహ్మాస్త్రశక్తి - మన్నింపఁ దగు నని మనమునఁ దలఁచి4670
వంచించి యారామవసుమతీనాథుఁ - డించుక సైఁచినాఁ డింతయే” యనుడు;
వాయుసూనుఁడు బ్రహ్మవరమునఁ జేసి - యాయింద్రజిత్తుదివ్యాస్త్రసంతతుల
జావకుండుట విభీషణుతోడ ననియె - "భావింపు మిప్పుడు భండనభూమి
నిటఁ బడ్డవారిలో నెవ్వరు గలరు? పటుబాణహతు లయ్యు బ్రతికినవారు”