పుట:Ranganatha Ramayanamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శ్రీరంగనాథరామాయణము

ద్విపద


బవనజుఁ డటఁ బట్టువడిపోవుటయును, గవిసి లంకాపురి గలయఁ గాల్చుటయు,
మానినీమణి శిరోమణి నిచ్చుటయును - మానితాత్ముం డబ్ధి మరల దాఁటుటయు,200
మధువనహరణంబు, మణి ప్రీతి నిచ్చి - యధిపతి మారుతి నాశ్వసించుటయు,
నినకులాధిపుఁడు దండెత్తిపోవుటయు, - వనధితీరంబుస వచ్చి నిల్చుటయు,
వనరాశి త్రోవ యివ్వక క్రొవ్వుటయును - గొనకొని రాముండు గోపించుటయును,
నంత విభీషణుఁ డధిపుఁ గాంచుటయుఁ - జింతించుటయు మఱి సేతుబంధనము,
జడధి దాఁటుటయును, జని లంకమీఁద - విడిసి పేర్చుటయు, దోర్వీర్యంబు మెఱసి
కర ముగ్రులగు కుంభకర్ణాదివీర - వరులఁ ద్రుంచుటయు రావణునిఁ జంపుటయు,
నావిభీషణుని లంకాధినాయకునిఁ - గావించి పట్టంబు కరుణఁ గట్టుటయు,
ననుపమశుద్ధి బ్రహ్మాదుల మెచ్చ - జనకజ రఘురామచంద్రుఁ బొందుటయు,
నెలమిఁ బుష్పక మెక్కి యెల్లరు వేడ్కఁ - జెలఁగి యంభోనిధి సేతువుమీఁదఁ
దెలిసి శ్రీకంఠుఁ బ్రతిష్ట సేయుటయు, - వెలయ నయోధ్యకు వేగ వచ్చుటయు,210
భరతు గాంచుటయును, బట్టాభిషేక - మరుదుగా రఘురాముఁ డవధరించుటయు,
గపిసైన్యపతుల నర్కజవిభీషణుల - విపులసంపద లిచ్చి వీడుకొల్పుటయుఁ,
బరికించి ప్రజల కాపద లొందకుండ - గరుణ ట్రోచుట, యనుకథలెల్లఁ దెలిసి
వెలయ నిర్వదినాల్గువేలశ్లోకములు - గలిగి, యేనూఱుసర్గల విస్తరిల్లి
కాండంబు లాఱింటఁ గర మొప్ప మిగిలి - యుండ, రామాయణ మొప్పఁ గావించి
యొనరఁ దక్కినకథ లుత్తరకాండ - మునఁ జెప్పి, వాల్మీకిమునినాథుఁ డంత
ఈకథ పఠియుంప నెవ్వరు నేర్తు - రీకథ జగముల నెబ్భంగి వెలయు,
ననుచుండ కుశలవు లనఘమానసులు - మనసిజాకారులు మంజుభాషణులు,
జననుతుల్ సంగీతసాహిత్యపరులు - మునివేషధారు లిమ్ముల వచ్చి మ్రొక్కి,
యనఘ! రామాయణం బర్థితో జదువ -జనుదెంచితిమి మమ్ముఁ జదివింపవలయు,"220
ననిన సంతోషించి యమ్మునీశ్వరుఁడు - "తనమనోరథమెల్లఁ దలకూడె" ననుచు
గేయమై పాఠ్యమై కేవలపుణ్య - దాయకం బగు రఘూత్తముచరిత్రంబు
ననుపమతంత్రీలయాన్వితఫణితి - మునిపతి చదివింప ముద మొప్పఁ జదివి,
రమణశృంగారాదిరసము లేర్పడఁగ - సమవృత్తిభేదముల్ సంధి సమాస
సమధికశబ్దార్థసంగతు లెఱిగి - క్రమ మొప్ప బాడుచుఁ గవగూడి వారు
మునిజనసభల నిమ్ములఁ బూజనములు - గొని, వినోదింపఁ గాకుత్స్థవల్లభుఁడు
వెలయఁ దమ్ములు దాను వేడ్క లింపొందఁ - గొలువిచ్చి వారలఁ గోరి రావించి
వారిరూపంబులు వారినిల్కడలు - వారినిర్మలతరవాగ్విశేషములు,
తనకు నిం పొనఠింపఁ దత్కథాక్రమము - వినుచుండె రాముఁ డవ్విధ మెట్టిదనిన:—