పుట:Ranganatha Ramayanamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

శ్రీరంగనాథరామాయణము

ద్విపద



గరుణమైఁ గాపాడి ఖరదూషణాది - శిరములు శరములఁ జెండుచెండాడి,
ఋశ్యమూకంబున నినజుఁ జేపట్టి - వశ్యత నొకకోల వాలిఁ దూలించి,
సీతకై చలపట్టి సేతువు గట్టి - పాతకదశకంఠుపదితల ల్గొట్టి,
సీతతోఁ గూడి, యాశ్రితలోక పారి - జాతంబు వనచరజాతంబు గొలువ
నింద్రాదివినుతుఁడై యేతెంచి, రామ - చంద్రుండు నిజపూజ్యసామ్రాజ్యలక్ష్మిఁ
బాలించుచున్నాఁడు; ప్రజలకు వేడ్క - గీలించుచును గృతకృత్యుఁడై" యనుచు140
నారాముచరిత మాద్యంతంబు చెప్పి - నారదముని పోయె నలినజుపురికిఁ;
మునిపతి వాల్మీకి ముద మొప్ప నంత - దనశిష్యుఁ డగు భరద్వాజుండు దాను
బ్రకటింప సజ్జనభావంబు పోలె - నకలుషజీవనం బై కరం బలరు
తమసానదికిఁ బోయి, తన్నదీవారిఁ - దమయనుష్టానము ల్డగఁ జేయుచుండి,
యాయేటిదరిఁ గ్రౌంచయమళంబు ప్రేమ - గాయజుకేళిమైఁ గవయుచో, నొకటి
నొకబోయ చంపిన, నున్నయాక్రౌంచి - ప్రకటశోకంబునఁ బలవింపఁ జూచి,
దగవును ధర్తంబు తలపోసి మౌని - పగదాయ నబ్బోయపై నల్క వొడమి.
"యోరి నిషాదుండ! యోరిపాపాత్మ! - యోరి! నీ కేమి యొునరించె? రోరి
కామించి క్రౌంచముల్ గవయుచో నొకటి - నేమిటికై చంపి తిబ్భంగిఁ గదిసి?
యాపాతకమున ననేకదుఃఖములు - ప్రాపించి తిరుగుము బహువత్సరములు."150
అని బోయ శపియించి, యంత వాల్మీకి - దనశిష్యుఁ డగు భరద్వాజునిఁ జూచి,
పలికెను శ్లోకంబుపద్ధతిగాను - “బలికినపల్కును బలుమాఱు చూడ
ఛందోనిబద్దమై సమవర్ణపంక్తిఁ - బొంది నాలుగుపదంబుల హృద్య మగుచు
నిది చాలవిస్మయ మీశాపవాక్య - పదములు దమయంతఁ బద్యమై నిలిచె."
ననిన భరద్వాజుఁ డాదిగా శిష్యు - లనురక్తిఁ బఠియించి రాపద్య మంత;
ననఘుఁ డావాల్మీకి యాశ్రమంబునకుఁ - జనియున్నచో బ్రహ్మ చనుదెంచుటయును
నెదురేగి పదముల కెరఁగి తోడ్తెచ్చి - కుదురుగాఁ గుశపీఠిఁ గూర్చుండజేసి,
కరమర్ధి బూజించి, కరములు మొగిచి - పరఁగ శాపాక్షరపద్యంబుఁ జదువ
విని, బ్రహ్మ నగి, “పద్యవిషయమై వాణి - యనఘ! నీముఖమున నవతరించినది;
శ్రీరామచరిత మశేషంబు నాకుఁ - గోరి నారదుఁడు సంకోచించి చెప్పె.160
నది విస్తరించి నీ వఖిలంబు చెప్ప - నది; సర్వమును దోఁచు"నని చెప్పి పోయె.
నీరీతిఁ గృప వరం బిచ్చి మన్నించి - సారసగర్భుండు సనినపిమ్మటను
మఱి నిర్మలధ్యానమతిఁ బూని మౌని - తఱిగొని సకలంబుఁ దలపోసి చూచి.
రఘుచరిత్రము, దశరథుచరిత్రంబు - రఘురాముజన్మంబు, రామువర్తనము,
తాటకవధయు, నుద్దండరాక్షసుల - యాటోపహరణంబు, యజ్ఞరక్షణము,
దనరు గంగామహత్త్వంబు, గౌతముని - వనితను శాపంబువలనఁ బాపుటయు,