ముగాను మత్తుగాను పడియుండెను. మఱునాఁటి యుదయమున మరల హరిశాస్త్రులు వచ్చి రుక్మిణిని పట్టినది మొండిగ్రహ మనియు, మహామంత్రముచేతఁ గాని శాబరములచేత సాధ్యము కాదనియు, అయినను తానుజేసిన తపస్సంతయు ధారపోసి వదలఁగొట్టెదననియు జెప్పి, రాత్రికి తొమ్మిదిమూరల క్రొత్తవస్త్రమును, అఖండము నిమి త్తము మణుగునేయియు పుష్పములను, ఆఱుమూరల జనపనార త్రాడును, నాలుగు మేకులును, రెండు కుంచముల నీరుపట్టు లోతైన యిత్తడిపళ్ళెమును సిద్ధముచేయించి రెండవ త్రోవలోని యొక గదిని గోమయముతో నలికించి యుంచఁడని రాజశేఖరుఁడు గారితోఁ జెప్పిపోయెను. రాజశేఖరుఁడుగా రాప్రకారము సర్వము జాగ్రత్తపెట్టించి యాతనిరాక కెదురుచూచుచుండిరి, ఆతఁడు రాత్రి తొమ్మిదిగంట లయినతరువాత వచ్చి గదిలో అఖండదీపమును వెలి గించి, అమ్మవారి పెట్టెను దాని సమీపమున నుంచి, బియ్యపు మ్రుగ్గుతో గదికినడుమ నొక చిన్న పట్టుపెట్టి యందులో రుక్మిణిని గూరుచుండఁబెట్టి కొంచెముసేపు తనలో నేమో మంత్రమును జపించి దిగ్బంధనము చేసి గది నాలుగుమూలలను మంత్రోదకమును చల్లి రుక్మిణి నావలకుఁ దీసికొనిపోవచ్చునని చెప్పి, ఆమెను లోపలికిఁ గొనిపోయిన తరువాత గదితలుపు లోపలగడియ వేసికొని గడియ సేపుండి వెలుపలికివచ్చి పయిని తాళమువేసి, ఆ గ్రహమునకు బ్రతికి యున్న కాలములో నృసింహమంత్రము వచ్చియున్నది, కాబట్టి యది యేదేవతకును లోఁబడునది కాదనియు, తన యావచ్చక్తి విని యోగించి గదిని విడిచి రాకుండునట్లు బంధించి మాత్రము వచ్చితి ననియు, తా నీవలనుండి శరభసాళ్వమును బ్రయోగించినచో ఘోర యుద్ధముచేసి లోబడును గాని మఱియొక విధంగా లోఁబడదనియు చెప్పి-"ఓం-ఖేం-ఖం-ఘ్రసి-హుం-ఫట్ - సర్వశత్రు సంహారిణే- శరభసాళ్వాయ- పక్షి రాజాయ-హుం-ఫట్-స్వాహా"-ఆని శరభ సాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండుమాఱులు మంత్రము నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొకమనుష్యుని మఱి