పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాణిక్యాంబ__నాన్నగారితో వంటయినది స్నానమునకు లేవ వచ్చునని చెప్పు.

మాణిక్యాంబ రాజశేఖరుడుగారి భార్య. ఆమె రుక్మిణితో సమానమయిన తెలివి గలదియు విద్యనేర్చినదియుఁ గాకపోయినను, గృహకృత్యములను జక్కపెట్టుటయందును పాకము చేయుట యందును నిరుపమానమయిన ప్రజ్ఞ కలది: రూపమున చాలావఱకు పెద్దకుమార్తెను పోలియుండునుగాని మొగము కొంచెము ముదురు దిగాను దేహచ్ఛాయ యొకవాసి నలుపు గాను కనబడును. ఆమె ముప్పదినాలుగేండ్ల వయస్సు కలదయ్యును దూరముననుండి చూచుటకు చిన్నదానివలెనే యుండును.

అంతట సీత మరలఁ జావడిలోనికి బరుగెత్తుకొని వచ్చి, నాన్నగారూ అమ్మ స్నానమునకు లెమ్మను చున్నది" అని చెప్పి యెప్పటియట్ల గవ్వలాడుటకయు నూతి పంచ పాళిలోనికిఁ బోయెను.

రాజ__ప్రసాదరావుగారూ! మీరు స్నానము చేయుదురేమో నూతిదగ్గఱకుఁ బొండి. భైరవమూర్తిగారూ! గోదావరికి వెళ్లెదరా ? లేక నూతియొద్దనే నీళ్లు పోసికొనెదరా ?

భైర__కార్తిక సోమవారము గనుక గోదావరికే వెళ్లెదను.

అప్పుడక్కడ నున్నవారందఱును లేచి, రాజశేఖరుడుగారి యొద్ద సెలవు పుచ్చుకొని ఎవరిండ్లకు వారు వెళ్ళిరి. రాజశేఖరుఁడు గారును పడమటింటిలోనికి నడచిరి. లోపల సానమీఁద గంధము తీయుచున్న మాణిక్యాంబ మట్టియల చప్పుడుతో పడమటింటి దొడ్డి తలుపుకడకు నడచి, యొకకాలు గడప కీవలను రెండవకాలు పంచ పాళిలోను బెట్టి, కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువఁబడి "రుక్మిణీ! బాబయ్యగారు స్నామునకు వచ్చినారు; వేగిరము వచ్చి నీళ్ళందిమ్ము" అని కేకవేసెను. ఆ పిలుపు విని, దేవతార్చనకుఁ బూలు గోయుచున్న రుక్మిణి 'వచ్చుచున్నాను' అని పలికి తొందరగా రాగి హరివాణముతో నిత్యమల్లిపుష్పములను తులసిదళములను దెచ్చి

50