పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయు రూపాయతో మఱియొక రూపాయను జేర్చి యొకరీతిగా జరుపు కొని వచ్చుచున్నాను. కాని నందాదీపములో మఱియొకరికి భాగ ముండుట నాకిష్టములేదు. స్వామికి బొత్తిగా వాహనములు లేవు. పొన్నవాహన మొక్కటి యుండెనా రేపటి యధ్యయునోత్సవములో నెంతయైన నిండుగా వుండును. అది యీ యేటికిఁ గాకపోయిన మీఁదటికైనను మీకే మాటదక్కవలెను. ముందుగా చెవిని వేసి యుండిన నెందునకయినను మంచిదని మీతో మనవి చేసినాను.

రాజ__మొన్న దేవాలయములో స్వాములలో స్వాములేమో పోట్లాడినారఁట.

రాఘ__ద్వారకా తిరుమలనుండి వచ్చిన స్వామి సాపాటుచేసి కూర్చుండియుండఁగా, పెంటపాడునుండి వేంచేసిన స్వామి పెరుమాళ సేవ చేసి వచ్చి కూర్చున్నారు, వారిద్దఱిలో నొకరు తెంగలె వారును ఒకరు వడహలెవారెను గనుక, నామము క్రింద పాద ముంచవచ్చును _ కూడదని మాట పట్టింపులు పట్టుకొన్నారు.

రాజ__ఊరకే మాటలతో సరిపోయినదా?

రాఘ__తరువాతఁ గొంచెము చేయి చేయి కలసినదిగావి ముదరనీయక నేనును నాతమ్ముఁడును అడ్డము వెళ్ళి నివారించినాము.

రాజ__మన జనార్ధనస్వామివారి కేమాత్రము మాన్యమున్నది?

రాఘ__ఏడుపుట్ల మాన్య మున్నదందురుగాని, అయిదు పుట్లు మాత్రము బోగమువాండ్రక్రింద జరుగుచున్నది. తక్కిన రెండుపట్ల భూమియు ఆర్చకులదిగాని స్వామిది కాదు,

రాజ__మొన్నజరిగిన స్వామియుత్సవములో బోగము మేళము రాలేదే :

రాఘ__వా రన్నియుత్సవములలోను రారు. రాజమహేంద్ర వరములోఁ గాపుర మున్నారుగనుక చిల్లర పండువులకెల్ల బండ్లు చేసి కొనివచ్చుట బహుప్రయాసము. ఒక్కస్వామి కళ్యాణదినములలో రథోత్సవమునాఁడుమాత్రము వత్తురు. అవ్పడు వారిబత్తెముక్రింద స్వామి ద్రవ్యములోనుండి నాలుగు రూపాయలు మాత్ర మిచ్చుట యాచారము.

47