పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఱిన తరువాత నామెకు ధైర్యము చెప్పి, ఆ కూలివానివెంట నాపూటనే బయలుదేఱి కాళ్ళు పొక్కు-లెక్కునట్లుగా తెల్లవాఱినఁదాఁక నడచి మఱునాఁడు పగలు రెండు జాముల వేళకు మా యిల్లు చేరితిని. అప్పుడా యింటికి గోడలు తప్ప మఱి యేమియు లేవు. చుట్టుపట్ల నొక యిల్లయిన కాలక వింతగా మాయెుక్క యిల్లు మాత్రము పరశు రామ ప్రీతి యయినది. నేనక్కడ విలపించుచుండఁగా నిరుగుపొరు గులవారు వచ్చి నన్నోదార్చి, నాలుగు దినముల క్రింద రాత్రి యాక స్మికముగా గృహమునకు నిప్పంటుకుని సాయము వచ్చులోపలనే కాలిపోయినదని చెప్పిరి. నేనంతట నారాయణమూర్తిగారి యింటికిఁ బోయితిని. ఆతఁ డావఱకే మా తండ్రికి దహన సంస్కారములు చేయించెను. మీ రా గ్రామమునుండి వచ్చినప్పటినుండియు మా నాయనయు నారాయణమూర్తిగారును ప్రాణ స్నేహము కలవారుగా నుండిరి. మీరు ధవళేశ్వరము విడిచిపెట్టిన నెల దినములకు నారాయణ మూర్తిగారి లోపల దొంగలు పడి యొక రాత్రి సర్వస్వము దోచు కొని పోయిరి. అందుచే నతఁడు మరల బీదవాడై మాతండ్రి ననుస రింపఁగా, భూత వైద్యములో తనకు సహాయునిగా నాతనిని త్రిప్పుచు భోజనము కేమయిన నిచ్చుచుండెను. మా నాయనకు గ్రామములో నందఱును శత్రువులుగా నేర్పడినప్పడు, నారాయణమూర్తిగారొక్కరే పరమ మిత్రుఁడుగా నున్నాడు. మీ బావమఱఁదికి గ్రామము లోనివారు తన సొత్తును దోచుకొని పోవుదురని భయము తోచినప్పడు ఒకనాఁటి రాత్రి రహస్యముగా నన్ను తోడు పట్టమని నగలను రొక్క మునున్న పెట్టెను నారాయణమూర్తిగారి యింటికిఁ గొనిపోయి అతని పడకగదిలోఁ బెట్టి లక్కతో ముద్ర వేసి పైన కప్పతాళము వేసి తాళపు చెవిని తన దగ్గఱనే యుంచుకొనెను. నారాయణమూర్తి నన్నుఁ జూచి మా నాయనను తలచుకొని యేడ్చునప్పడు, మా యొద్ద దాచు కొన్న నగల పెట్టెను గూడ మరణకాలమునకుఁ దీసికొనిపోతివా"యని యేడ్చెను. నేను పడక గదిలోకి వెళ్ళినప్పుడు పెట్టె యచ్చట లేదు; ఆ యింట మఱియొకచోటను గనఁబడలేదు. తరువాత మా తండ్రి చావును గురించి యడుగగా, నేను హేలాపురమునకు వెళ్ళినది