పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బదులు నిమిత్తము వెళ్ళినను లేదనుచుండిరి. పొరుగువారు తమ నూతిలో నీళ్ళు తోడుకొన వలను పడదనిరి. అందుచేత నీ ప్రకారముగా శత్రుమధ్యమున కాపురము చేయుట మా నాయన కెంతో భారముగా నుండి, ఇది యంతయుఁ దాను భూతవైద్యుఁడనని వేషము వేసికొనుట వలన గలిగిన పాప ఫలము గదా యని పశ్చాత్తాప పడిన కార్యములేక స్వయంకృతాపరాధమునకు నోరెత్తక యనుభవించు చుండెను. ఇట్లున్న సమయములో నొకసారి సవతితల్లికి దేహములో రుగ్ధత వచ్చినది; అప్ప డెందఱిని గాళ్ళుకడుపులు పట్టుకొన్నను ఒక్కరైనను పథ్యపానములు చేసి పెట్టుటకుఁ గాని నిద్రరాకుండ దగ్గఱ నుండి మాటలు చెప్పటకుఁ గాని వచ్చినవారు కారు; గ్రామములోనివా రెవ్వరును పథ్యపానమునకయి తమ నూతిలోనుండి నీళ్ళు సహితము తెచ్చుకోనిచ్చినవారు కారు; మీరు గ్రామమునుండి లేచివచ్చిన నాలవ నాఁడే మన గ్రామములో వైద్యుడుగా నుండిన నంబి వరదాచార్యులు పోయినాఁడు. నేతి రామయ్య మన యింట వంట బ్రాహ్మణుఁడుగా నుండి కంచు చెంబుల జో డెత్తుకొనిపోయి ముండ కిచ్చినందుకయి మీరు పని తీసివేసిన తరువాత వాడు మఱియెందునకును పనికిరానివాఁ డౌటచేత చదువులబడి పెట్టుకొని జీవనము చేయుచుండెను గదా!. వరదా చార్యులు పోఁగానే వైద్యము కూడ నారంభించి వాఁడిప్పడు గ్రామ మలో ఘనవైద్యుఁడయి యున్నాడు. మొదట వైద్య మారంభించి నప్పుడు క్రొత్త గనుక రోగముల నామములను ఔషధ నామములను మా నాయన చేతనే వ్రాయించుకొని యొఱ్ఱవియు నల్లనివియు నయిన కుప్పెలుచేసి తీసికొనివచ్చి యేమం దేరంగు గలదిగా నుండునో మా నాయన వలననే తెలిసికొని వానిమీద "పూర్ణచంద్రోదయము" "వాత రాక్షసము" మొదలయిన పేర్లను వ్రాసి యంటించినాఁడు. జీలకఱ్ఱ, మిరియములు మొదలయిన వస్తువులలో సిందూరము వేసి నిమ్మ కాయల రసముతో నూరి మా యింటనే మాత్రలు చేసి తీసికొని వెళ్ళు చుండెను అతఁడే యౌషధము నడిగినను తనయొద్ద లేదనక తులమునకు రూపాయ మొదలుకొని యిరువది రూపాయల వఱకును వెలగట్టి