గుర__మహాప్రభూ! నిన్న ప్రొద్దున మమ్మిద్దఱును పిలిచి యీరాజుగారు చిన్నదానిని రవణక్కపేట కెత్తుకొనిపోయి, యక్కడ పద్మరాజున కొప్పగించవలసిన దని యాజ్ఞాపించినారు.చిన్నది రాగానే దొంగతనముగా పెండ్లియాడుటకై పద్మరాజు ముందుగానే పోయి యక్కడ నున్నాఁడు.
శోభ__కాదు కాదు, ఈ దొంగలంజకొడుకులు పాఱిపోయి, తప్పించుకొనుటకయి యీలాగున బొంకుచున్నారు.
గుర__ఈ రాజు దొంగల గురువు. మునుపు మా చేత దారులు కొట్టించి తిన్నగా మాసొమ్ము మా కియ్యక సకలమయిన చిక్కులు పెట్టినాఁడు. ఈ బ్రాహ్మణుని దోచుకొనుటకు వచ్చి మే మారాత్రి యాయనమూలముగా పడ్డపాట్లు తలఁచుకొన్న నిప్పటికిని మాకు దుఃఖము వచ్చుచున్నది.
కృష్ణ__వెనుక నీప్రకారముగా దారులు దోపించినావా?
శోభ__లేదు లేదు, ఈ విధవ కొడుకు లబద్దమాడుచున్నారు.
గురు__మా మాట లబద్దమేమో పాపయ్యగారిని పిలిపించి విచారింపవచ్చును. ఇప్పడాయన యీ చెఱసాలలోనే యున్నాడు.
కృష్ణ__ఓరీ పాపయ్యను పిలుచుకొనిరా.
కొంతసేపటికి పాపయ్య వచ్చి రాజుగారు నిజము చెప్పిన యెడల శిక్ష తగ్గించెదమని వాగ్దానముచేసినందున మొదటి నుండియు నాతని చర్యయంతయు నేకరువుపెట్టెను. అందుమీద శోభనాద్రిరాజు మాఱు పలుక నోరురాక క్రింద చూచుచు మిన్నకుండెను. రాజుగారి మొగము పోలికయు కంఠస్వరమును రామరాజువానివలె నున్నందున, రాజశేఖరుఁడుగారు దేహమంతయుఁ జెమర్ప దిగ్భ్రమము నొంది యూరక తెల్లబోయి చూచుచుండెను. అప్పుడు రాజుగా రాయన వెలవెల పాటును తత్తరమును గనిపెట్టి సింహాసనమునుండి దిగి వచ్చి చేయి పట్టుకొని, వెనుక రామరాజను పేరునఁ బలుమాఱువచ్చి యోగక్షేమం బుల నారయుచు వచ్చినది తామే యనియు, వెంటనే సహాయముచేయు