మరల క్రొత్త ముహూర్తమును పెట్టించుకొని రమ్మనియే యా దుర్మార్గుఁ డిప్పు డు నన్ను మీ వద్దకుఁ బంపినాఁడు.
సుబ్బ__ఆ పాపకర్మని మాఁట యిఁక నాతోఁ జెప్పకుఁడు. ఆ పాపాత్ముని ప్రేరణమువలన మీ యింట ముహూర్తము పెట్టిన నాఁడే నాకు రోగ మారంభమైనది. కాబట్టి మీ యెడలచేసిన మోస మునకు శిక్షగా భగవంతుఁడు నాకీ యాపదను దెచ్చిపెట్టినాఁ డనుకొని వివాహము కాకమునుపు రోగము కుదిరెనా మీతో నిజము చెప్పి వేసి పాప పరిహారము పొందవలెనని కోటి వేల్పులకు మ్రొక్కుకొన్నాను. ఆలాగునను కుదిరినది కాదు, అటు తరువాత "వారిజాక్షు లందు వైవాహికములందు బ్రాణవిత్తమానభంగమందుఁ జకిత గోకు లాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొంద డధిప॥"అను శుక్రనీతిని దలచుకొని వివాహకార్యమునకై కల్లలాడితిని గదాయని కొంత మనస్సమాధానము చేసికొన్నాను. ఈ నీతిని బట్టియే యెవ్వ రును మీతోఁ బద్మరాజు విషయమై ప్రస్తావించినవారు కారు.
రాజ__ఇప్పుడే పోయి యీ సంగతి శోభనాద్రిరాజు నడిగి యనవలసిన నాలుగు మాటలు మొగముమీఁదనేయని వేసివచ్చెదను.
ఆని వెంటనేపోయి శోభనాద్రిరాజు వీధిగుమ్మములో నిలు చుండియుండగా జూచి "మీరేమో గొప్పవా రనుకొని మీ మాటల నమ్మి మోసపోయినాను.మీతో నింతకాలము స్నేహము చేసినందుకు, నా కొమార్తెను నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొఱకా ప్రయత్నము చేసినారు?" అని నిర్భయముగాఁ బలికి రాజశేఖరుఁడు గారు వెనుకకు మరలిరి. శోభనాద్రిరాజు మరలఁ బిలిచి "మావద్దఁ బుచ్చుకొన్న రూపాయలనిచ్చి మఱిపొమ్ము' అని నిలువఁబెట్టెను. "మీరిచ్చిన రూపాయలును నా యొద్ద నున్న రూపాయలును కూడఁ గలిపి వానితో వివాహమునకు వలయు వస్తువులనెల్ల కొన్నాను. ఇప్పుడు నాయొద్ద రొక్కములేదు; చేతిలో నున్నప్పు డిచ్చెదను"