పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివేక చంద్రిక

అను

రాజశేఖర చరిత్రము

వెుదటి ప్రకరణము


ధవళగిరి__ దేవాలయవర్ణనము__ గోదావరి యొడ్డున నున్న ధర్మశాల మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు వచ్చి కూర్చుండుట__ అప్పు డచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగువారి స్తుతివచనములు__ అందఱును గలిసి రామపాదములయొద్దకు బైరాగిని చూడఁబోవుట.

శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికా కంకణాదుల మెఱుంగులు తుఱంగలింపఁ దనజననమునకు స్థానమైన భూభృద్వర పురోభాగముననే పల్లములంబడి జాఱుచూ లేచుచుఁ గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లఁగా ముందుముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధురస్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆ పిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లివేళ్ళను విడిచి తక్కినవేళ్ళనంటుచుబాఱి జమ్ములో నడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి విదర్భాదిదేశములగుండఁ బ్రయాణములుచేసి త్రోవపొడుగునను వచ్చిపుచ్చుకొననివారిదే లోపముగా స్నానపానంబులకు వలయునంత నిర్మల జలం బొసంగి యాబాల వృద్ధ మందఱి నానంద మొందించుచు తానడుగిడిన చోటులనెల్ల సస్యములకును ఫలవృక్షములకును జీవనములిచ్చి వానిని

13