పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నవి? మా మహారాజుగారి తండ్రిగారి కాలములో పూర్వము జరుగుచుండెడి ఘోరకృత్యములలో నిప్పుడు గుమ్మడికాయలో నావ గింజంత పాలయినను లేవు. ఆ కాలములోనే మీ రీపట్టణమునకు వచ్చి యుండినయెడల మంచిబట్టలు కట్టుకొని పట్టపగలీ ప్రకారముగా వీధిలో నిర్భయముగా నడవఁ గలిగి యందురా? మా రాజుగారు సహస్ర ముఖముల కనుగొని నిత్యము దుర్మార్గుల ననేకులను శిక్షించుచుండుట చేతనే యిప్పుడు నరహత్యలు మొదలయిన ఘోరపాతకము లేవియు జర గకున్నవి.

రాజ__ఈ పట్టణములో వేదవిహిత కర్మానుష్టానములు చక్కగా జరుగుచుండునా?

సత్ర__త్రికాలములయందు యధావిధిగా జరుగుచుండును.

రాజ__ఆట్లయిన, నీ విప్పుడు సంధ్యావందనము చేసినావా?

సత్ర__ఎన్నడో వడుగునాఁడు నేర్చుకొన్న సంధ్యావందనము మఱచి పోక యిప్పటిదాఁక జ్ఞాపక ముంచుకొన్నా ననుకొన్నారా?

రాజ__పోనీ, అర్ఘ్యమునయిన విడిచినావా?

సత్ర__ఒక్క అర్ఘ్యమును మాత్రమేకాదు, సంధ్యావందన మంతయు విడిచినాను.

ఈ సంభాషణము ముగిసినతరువాత ప్రొద్దుపోయినందున రాజశేఖరుఁడుగారు లేచి వెళ్ళి భోజనముచేసి, తరువాత నొక్క రును పరుండి యాలోచించుకొని మోసములకెల్లను పుట్టినిల్ల యిన యీ పట్టణమును సాధ్యమయినంత శీఘ్రముగా విడిచి పెట్టవలయునని నియమించుకొనిరి; కాబట్టి మఱునాఁడు ప్రాతః కాలముననే యెుక బండిని కుదుర్చుకొనివచ్చి, కుటుంబ సహిత ముగా దాని మీదనెక్కి జాము ప్రొద్దెక్కువఱకు భీమవరము చేరిరి. బండిమీద నెవ్వరో క్రొత్తవారు వచ్చినారని యూరిలో నెల్లవారును జూడవచ్చి, వారి నివాస స్థలమును గుఱించియు ఆగమన కారణమును గుణించియు ప్రశ్నలు వేయఁజొచ్చిరి; చెప్పిన దానినే మరలమరల నడిగిన వారికెల్లను జెప్పలేక రాజశేఖరుఁడు