దూరము దాఁటి యదృశ్యులయినందున వెనుకకు మరల వచ్చి రాజ శేఖరుడుగారిని కలిసికొనెను.
రామ__రాజశేఖరుఁడుగారూ! ప్రొద్దుండగానే యీ స్థలమును దాఁటవలసినదని నేను మధ్యాహ్నముననే బహువిధముల బోధించితిని గదా? మీరు నా మాటలను లక్ష్యముచేయక యీ యాపదను దెచ్చి పెట్టుకొంటిరి.
రాజ__ఓహోహో, రామరాజుగారా? మీరు మా పాలిట దైవమువలె సమయమునకు వచ్చి మా యందఱి ప్రాణములను నిలువఁబెట్టిరి. మీ రింకొక నిమిషము రాకుండిన మేమందఱము నా దుర్మార్గుల చేతులలోఁ బడిపోయి యందుము. మీ రీవేళ నిక్కడ కెట్లు రాగలిగితిరి ?
రామ__మీతో వచ్చిన కిరాతుఁడు యోగిచే దొంగలను బిలుచు కొని వచ్చుటకయి పంపఁబడి, యెండలో నడువలేక యొక పాకలోఁ బరుండియున్న నన్నుఁ దనవారిలో నొకనిగా భ్రమించి తన గురువు కొందఱు బ్రాహ్మణులు చింతచెట్టువద్దకు వెళ్ళుచున్నాఁడని చెప్పెను.ఆ మాటలు విన్నతోడనే యా బ్రాహ్మణులు మీరేయని యూహించి నా కచట గాలునిలవక దొంగలను వారింపవలె నను నుద్దేశముతో యోగియున్న తావునకుఁ బోతిని. అక్కడ నా వరకే దొంగలు వచ్చి యోగితో మాటాడిపోయినారన్నవార్త విని గుండెలు పగిలి నేను వచ్చులోపల మీకేమి యుపద్రవము వచ్చునో యని మార్గాయాసము నేమియు లక్ష్యముచేయక యొక్కపరుగున వచ్చి యుక్త సమయమున మీఁకు దోడుపడఁగాంచి, నా జన్మము కృతార్థత గనెను గదా యని సంతోషించు చున్నాఁడను.
అనునప్పుడు మాణిక్యాంబ రుక్మిణిని నఖశిఖపర్యంతము తడవి చూచి గొంతెత్తి యేడ్వఁజొచ్చెను. రామరాజును రాజశేఖరుఁడు గారును గూడ దగ్గఱకుఁ బోయి చూచి కడుపుపట్టి చూచి ముక్కు దగ్గఱ వ్రేళ్ళు పెట్టి యూపిరి గానక దెబ్బచేతను భయముచేతను మరణము నొందెనని నిశ్చయించుకొనిరి. రామరాజును నాడి నిదానించి