Jump to content

పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

సంవత్సరాది__రాజశేఖరుఁడు గారి ప్రయాణము__రాజానగరము నకు సమీపమున నొకరాజు వడగొట్టి పడిపోవుట __నల్లచెఱువు సమీపమున నొకయోగి కనఁబడుట__ దొంగలు కొట్టుట__రుక్మిణి మరణము.

సంవత్సరాదినాడు తెల్లవారిన తరువాత రామమూర్తిగారు మంగలివానిని పిలిపించి రాజశేఖరుఁడుగారికిని సుబ్రహ్మణ్యమునకును వానిచేత తల యంటించిరి. ఇంటనున్న మగవారి యభ్యంజన స్నానము లయినతరువాత, ఆఁడువారందఱును తలంటుకొని నీళ్లు బోసికొనిరి. స్నానములయిన పిమ్మట వేపపువ్వును క్రొత్తమామిడి కాయ ముక్కలును క్రొత్తచింతపండు పులుసుతో నందఱును దేశాచారము ననుసరించి భక్షించి రెండుజాములకు పిండివంటలతో భోజనములు కావించి పండుగ చేసికొనిరి; పండుగదినములలో జనులు మఱింత యెక్కువ సుఖపడవలసినదానికి మాఱుగా, ఈ దేశములో వేళతప్పించి భోజనములుచేసి యట్టిదినములందు దేహములను మఱింత యాయాస పెట్టుకొందురు. మధ్యాహ్నము చల్లబడినమీఁదట రామమూ_ర్తిగారు రాజశేఖరుఁడుగారిని వెంటబెట్టుకొని నూతన పంచాంగశ్రవణమునకయి వేణుగోపాలస్వామివారి యాలయమునకుఁ వెళ్ళిరి. ఆ వఱకే యొక సిద్ధాంతి పసుపుతోఁ గలిపిన యక్షతలను పళ్ళెముతో ముందు పెట్టుకొని __

శ్లో॥ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహ
    గంగా స్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యంనృణాం
    ఆయుర్వృద్ధి దము త్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం
    నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం॥