జట్టు విరియఁబోసికొని చెట్లకు ధూపదీపములు సమర్పించి వేళ్ళను దీయుచుండిరి; గ్రహణ సమయమున దానముచేసిన మహాపుణ్యము కలుగునని చెప్పి బ్రాహ్మణ బ్రువులు తమ బట్టలు తడియకుండఁ బయి కెగఁగట్టుకొని మోకాలిలోతు నీళ్ళలో నిలుచుండి సంకల్పమును జెప్పుచు మూఢులయొద్దను స్త్రీలయొద్దను జేరి నీరుకాసులను గ్రహించు చుండిరి. పూర్వాచారమును బట్టి రాజశేఖరుఁడుగారు తామును స్నానము చేసిరిగాని, పయిని చెప్పిన కృత్యమును జేయువా రంద ఱును మూఢులని యెంచి గ్రహణవిషయమయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారంభించిరి. అతఁడు జ్యోతిష శాస్త్రమును నమ్మినను పురాణములను మాత్రము శాస్త్రవిరుద్ధముగా నున్నప్పడు నమ్మకుండెను. కాబట్టి-శ్లో॥ పశ్చాద్భాగా జ్ఞలదవదధ స్సంస్థితోథేత్య చంద్రో భానోర్బింబంస్ఫురదసితయా, ఛాదయత్యాత్మమూర్త్యా ఆను సిద్ధాంత శిరోమణి శ్లోకమును, శ్లో॥ ఛాదకో భాస్కరస్యేందు రథస్టో ఘనవద్భవేత్। భూచ్చాయాం ప్రాజ్ముఖశ్చంద్రో విశత్యస్య భవేదసౌ॥__అను సూర్యసిద్ధాంతశ్లోకమును జదివి, భూగోళమున కుపరిభాగమున సూర్యుడుండునపుడు చంద్రుఁడు తన గతివిశేషముచేత సూర్యునకును భూమికిని నడుమ సమకళయందు వచ్చునేని సూర్య గ్రహణము కలుగునుగాని రాహువు మ్రింగుటచేతఁ గలుగదనియు, పౌరాణికులు చెప్పినదే గ్రహణమునకుఁ గారణ మయినయెడల రాహు కేతువుల మనసులలోని యభిప్రాయములను దెలిసికొనుటకు మనము శక్తులము కాముకాబట్టి గ్రహణ మిప్పుడు కలుగు నని ముందుగా దెలిసికోలేకపోయి యుందుమనియు, సూర్య గ్రహణ మమా వాస్యనాడును చంద్రగ్రహణము పూర్ణిమనాఁడును మాత్రమే పట్టుటకుఁ గారణ ముండదనియు, రాహు కేతువు లాకాశమున నెప్పుడును గనఁబడకపోవుట యెల్లరు నెఱుఁగుదురు గాన సూర్య చంద్రులను మ్రింగఁగలిగినంత పెద్దవియే యయియుండినయెడల గ్రహణసమయమున నవేల కనఁబడకుండుననియు, రాహువే మ్రింగు నేని మన పంచాంగరీతిగా నీగ్రహణ మొక దేశమునఁ గనఁబడి మరి