పుట:Raadhika Santhvanamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యావలోకనము


సముఖము వేంకట కృష్ణప్ప నాయకుని
రాధికాసాంత్వన పీఠిక


రాయలనాఁటి రసికత నాయకరాజులనాఁటికిఁ బరకోటి ముట్టినది, పతనోన్ముఖము నైనది. అప్పటి యాంధ్రప్రబంధములు శృంగారరసపుఁ బసకును గసకును బరమావధు లని చెప్పవలె. అట్టివానిలో సముఖము వేంకట కృష్ణప్ప నాయకుని రాధికాసాంత్వనము నొకటి. పౌరాణికప్రతిష్ఠ గల ప్రబంధనాయికలలో రసప్రసిద్ధమైన వ్యక్తిత్వము గలవారిద్దఱే రాధిక, సత్యభామ. సముఖము కృతిలో నాయిరువురు నాయికలును గలరు. రాధికది ప్రధానభూమిక. సత్యభామ సవతి. రాయలనాఁటి ప్రబంధరాధిక స్వీయ. సత్యభామ సరేసరి; ఎప్పుడును ఖండితనాయికయే. అస లామె ఖండిత కాకున్నచో సొగసే లేదు. కాని దక్షిణాంధ్రకవుల చేతిలోఁ బడగానే వారి వాలకములు మారినవి. నాఁటి వీథినాటకములలో సత్యభామకును ప్రబంధములలో రాధకును బ్రాధాన్యము హెచ్చినది. రాధ పరకీయయు నైనది. పైఁగా సత్యభామ ఖండితనాయికాత్వము నామెకు సంక్రమించినది. సంప్రదాయసహజముగాఁ బ్రేమాభిరామములు గావలసిన యా నాయికల యాకృతు లప్పటికృతులలోఁ గామక్రీడాభిరామము లైపోయినవి. అయినను నభిరమ్యత యన్న దొకటి మిగిలియున్నది కనుకనే వాని కావ్యత్వమున కింత నిలుకడ గలిగినది.