అను సఖీమణి వాక్యము లాలకించి
బలిమి జులుములు విలసిల్ల బలసి చొరవఁ
జేసి చూచెద ననుచు నా శ్రీధరుండు
ఠీవి చెలగంగ లోఁ జొచ్చి పోవఁ గాంచి. (ము.ప.రా.సా. 4-13)
ఈ వైన మానాఁటి కెటు పోయెనో యని
చెప్పి కరంబులు విప్పువారు (స.రా.సా. 109)
ఈ బుద్ధి యానాఁడె యెందుఁ బోయె నటంచు
విడనాడి చేతులు విచ్చె నొకతె (ము.ప.రా.సా. 4-18)
పై యుదాహరణములలో నాడాడ మాటలే మాఱినవి కాని భావముల బండారము బయటపడుచునే యున్నది. ‘ఈవైన’మిత్యాది స్థలములలో మూలగ్రంథము సొగసులు కొన్ని ముద్దుపళని గ్రంథమునకు రాలేదు. ఇక్కడే మఱొక్కమాట; ఆమె వెలిదిండ్ల, శేషము వేంకటపతులను గూడ పలుకరింపక విడువలేదు. (చల్లకు వచ్చి ముంత దాఁచ నేల యని కాఁబోలు). ఇఁక సముఖములో రాయబార మెందులకు? వెంకటకృష్ణప్పయుఁ గవిత్వమున శేషముతో వియ్య మందినవాఁడే. అసలు వారిరువురు నాప్తసఖులు (చూ. అహల్యాసంక్రందనము-అవతారిక). ఆ వియ్య మహల్యాసంక్రందనమున నెక్కువ. రాధికాసాంత్వనమున నొక్కపోకడ.
తడవుఁ జూచిన దృష్టి తాఁకునోయని వాని
నును మోముఁ గనులారఁ గనఁగ నైతి
గబ్బిగుబ్బలు సోఁకఁ గందునో యని వానిఁ
గలసి నా మనసారఁ గలయనైతి (స.రా.సా. 12)
తడవుచూచిన దృష్టి తాఁకు నంచని వాని
సొగ సెల్లఁ దప్పక చూడ వెఱతు
మొన గుబ్బ లదిమి గ్రమ్మినఁ గందు నని వాని
లేఁత మేనును గౌఁగిలింప వెఱతు (తా.శ. 4-42)