ప్రసార ప్రముఖులు.
75
కందుకూరి రామభద్రరావు :
అమలాపురం తాలూకా రాజోలుకు చెందిన విద్యావినయసంపన్నులైన రామభద్రరావు విద్యావిభాగం ప్రొడ్యూసర్ గా విజయవాడ కేంద్రంలో పని చేశారు. వీరి కాలంలో విద్యాప్రసార రంగంలో కొత్త పోకడలు సృష్టించారు. స్వయంగా దేశభక్తి గేయాలు, ప్రణయ గీతాలు వ్రాశారు. కృష్ణశాస్త్రి భావకవితోద్యమ స్ఫూర్తిని పొందారు. స్వయంగా కొంతకాలం అధ్యాపకులుగా పని చేశారు. దూరదర్శన్లో పనిచేసే ఓలేటి పార్వతీశంగారికి మాతామహులు. వీరి కుమారులు కందుకూరి సూర్యనారాయణ రెండున్నర దశాబ్దాలపాటు ఢిల్లీ తెలుగు వార్తా విభాగంలో 'న్యూస్ రీడర్' గా పనిచేసి 1996 లో రిటైరయ్యారు. వీరి సతీమణి వెంకటలక్ష్మి రచయిత్రి.
వేమవరపు శ్రీధరరావు :
ఆకాశవాణి విజయవాడ కేంద్రం పరిపాలనా విభాగంలో రెండు దశాబ్దాలు పనిచేసిన శ్రీధరరావు చక్కని నటులు, భీమ పాత్రధారిగా ఆయన యావదాంధ్ర దేశానికి పరిచితులు. చక్కని గాత్ర, వాచికాభినయం గల శ్రీధరరావు పౌరాణిక నాటకాల ద్వారా ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
మరికొందరు :
రేడియోలో కొద్దిరోజులు పనిచేసి వివిధ రంగాలలోకి వెళ్ళినవారు ఎందరో ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటక విభాగానికి ఆచార్యులుగా పనిచేసి హైదరాబాదు కేంద్ర విశ్వ విద్యాలయంలో పనిచేసిన ఆచార్య మొదలి నాగభూషణశర్మ తొలి రోజుల్లో రెండేళ్ళపాటు ఆకాశవాణి పూనా కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. అలానే మచిలీపట్టణంలో జాతీయ కళాశాలలో ఆంగ్లశాఖ రీడర్గా పనిచేస్తున్న శ్రీ P. V. G. కృష్ణశర్మగారు భొపాల్ కేంద్రంలో రెండేళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. 'మల్లిక్'గా కథా, నవలా రచయితగా వారపత్రికల ద్వారా పరిచితులైన 'మల్లిక్' హైదరాబాద్ వివిధభారతి కేంద్రంలో కొద్దికాలం పనిచేసి రాజీనామా చేశారు. ప్రస్తుతం విశాఖపట్టణంలో పోలీసు కమీషనర్గా పనిచేస్తున్న శ్రీ R. P. మీనా కొంతకాలంపాటు రాజస్థాన్లోని ఆకాశవాణి కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఇలా ఇంకెందరో !