పుట:Prasarapramukulu022372mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ప్రసార ప్రముఖులు.

ఆమంచర్ల గోపాలరావు (1907-69) :

నెల్లూరు జిల్లా కావలిలో 1907 సెప్టెంబరు 26న ఆమంచర్ల గోపాలరావు జన్మించారు. చిన్ననాటి నుండి స్వాతంత్రోద్యమంలో విరివిగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో వాలంటీరుగా పనిచేశారు. జాతీయోద్యమంలో భాగంగా 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ప్రముఖ రాజకీయ నాయకులు డా|| బెజవాడ గోపాలరెడ్డిగారికి వీరు జిల్లా కాంగ్రెసు రాజకీయాలలో సమకాలికులు. గుంటూరులో యూత్‌లీగ్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొంతకాలం తెరవెనుక ఉండి పోవలసి వచ్చింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో 1952 లో వీరు పనిచేశారు.

గోపాలరావు చక్కని రచయిత. వీరి రచనలలో విశ్వంతర, హిరణ్యకశిపుడు ప్రముఖ నాటకాలు. మాట పట్టింపు, మల్లమ్మ ఉసురు, అపరాధి నాటికలు, చలనచిత్రరంగంలో గోపాలరావు కృషి శ్లాఘనీయం. తెలుగు చలన చిత్రాలలోనే గాక హిందీ చలన చిత్రాలలో గూడ సహాయ దర్శకులుగా పనిచేశారు. 'కాలచక్రం', 'ఒకరోజు రాజు' తెలుగు చిత్రాల దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మరికొన్ని చిత్రాలకు ఆర్ట్ డైరక్టరుగా పనిచేశారు.

చిత్రకారుడుగా గోపలరావు ప్రకృతి దృశ్యం చిత్రీకరణపట్ల ఆకర్షితులయ్యారు. చిత్రకళపై ఆయన అనేక వ్యాసాలు వ్రాశారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి కుడ్య శిల్పాల సౌందర్యాన్ని గూర్చి ఇంగ్లీషులో చక్కని గ్రంథం వ్రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమంచర్ల వారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కొంతకాలం అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా కార్మికుల కార్యక్రమాలు రూపొందించారు.

గోపాలరావు 1969 ఫిబ్రవరి 7న తనువు చాలించారు.