పుట:Prasarapramukulu022372mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

73

ఏల్చూరి విజయరాఘవరావు :

వేణుగానలోలురైన ప్రపంచ ప్రఖ్యాతిగన్న వ్యక్తి ఏల్చూరి విజయరాఘవరావు. నయాగరా కవులలో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం వీరి అగ్రజులు. ఆయన సోవియట్ లాండ్ కార్యాలయంలో సంపాదకులుగా పనిచేశారు. నరసరావు పేటలో జన్మించిన రాఘవరావు యింతింతై వటుడింతయై అన్నట్లు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. బొంబాయిలోని ఫిల్మ్స్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తూ ఎన్నో డాక్యుమెంటరీలు తీశారు. సంగీత దర్శకత్వం వహించారు. స్వయంగా నటులు. ఉదయశంకర్‌తో కలిసి పనిచేశారు. ఎన్నో సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ బిరుదంతో సత్కరించింది.

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి కుమారులు మురళీధర్ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1978-81 మధ్య డ్యూటీ ఆఫీసర్ గా పనిచేశారు. చక్కని పద్యరచన చేయగల సమర్థులు. ఆకాశవాణి పదవికి రాజీనామా చేసి కొత్త ఢిల్లీలోని వెంకటేశ్వర కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. పరిశొధన చేసి Ph.D. డిగ్రీ పొందారు. పురాణాలకు వ్యాఖ్యానం వ్రాసిన దిట్ట.

వింజమూరి లక్ష్మి :

గానకోకిలకు ప్రతిరూపం వింజమూరి లక్ష్మీ స్టాప్ ఆర్తిస్టుగా విజయవాడలో చేరి తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయ్యారు. ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడ, మదరాసు కేంద్రాలలో 20 ఏళ్లు పనిచేసి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. మదరాసులో స్థిరపడ్డారు. కర్ణాటక లలిత సంగీతాలలో ప్రావీణ్యం పొందారు.

ద్వారం మంగతాయారు, పెమ్మరాజు సూర్యారావు, M. V. రమణమూర్తి, సంగీత విభాగంలో పనిచేసిన మరికొందరు ప్రముఖులు. కుటుంబయ్యగారు, తంబురా కళాకారులే అయినా వ్యవసాయ విభాగంలో 'మార్కెట్ రేట్లు' రెండు దశాబ్దాలకు పైగా చదివారు. మిమిక్రీ కళాకారులు వీరిని అనుకరించడం కద్దు.