పుట:Prasarapramukulu022372mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ప్రసార ప్రముఖులు.

ఆకాశవాణి నిలయ కళాకారులుగా కొందరు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు స్వీకరించగా మరి ఎందరో ఆకాశవాణి ద్వారా తమ కళా నై పుణ్యాన్ని ప్రదర్శించి శ్రోతల మన్ననలు అందుకొంటున్నారు.

మలాది సూరిబాబు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో చక్కటి పేరు గడించారు. వీరి కుమారులు మల్లాది సోదరులు పేర గాత్రకచేరీలు నిర్వహిస్తున్నారు. సూరిబాబు రేడియో అనౌన్సర్‌గా రెండున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. శ్రీరామప్రసాద్, రవికుమార్ వీరి కుమారులు. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆరితేరినవారుగా వేదుసూరి కృష్ణమూర్తిగారి వద్ద విద్య నభ్యసించారు.

కుమారి కౌతా ప్రియంవద స్వరకర్తగా మంచి పేరు తెచ్చుకొన్నారు. సుప్రసిద్ద చిత్రకారులు కౌతా రామమోహన్ శాస్త్రిగారి పుత్రిక. వీరు విజయవాడ, కడప కేంద్రాలలో పనిచేసి పదవీ విరమణ చేశారు. కర్ణాటక లలిత సంగీతాలలో అందె వేసిన చేయి. విష్ణుభొట్ల సోదరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. విష్ణుభొట్ల ముకుంద శర్మ విశాఖపట్టణ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. రెండవ సోదరుడు ఉదయశంకర్ మృదంగ విద్యాప్రవీణుడు. వీరి సోదరీమణులు కృష్ణవేణి, సరస్వతి సంగీత విదుషీమణులు కావడం విశేషం. సరస్వతి భర్త B. V. S. ప్రసాద్ విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నారు. మోదుమూడి సుధాకర్, మంగళగిరి ఆదిత్య ప్రసాద్, శిష్ట్లా శారద, సద్గురు చరణ్, బి. వి. యస్. ప్రసాద్, సతీష్ విజయవాడ కేంద్ర నిలయ కళాకారులుగా విశేష సేవ చేస్తున్నారు. సుధాకర్ స్వరకర్తగా మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సతీమణి అంజని గాత్ర విదుషీమణి.

ఆకాశవాణి దశాబ్దాలుగా కళారంగానికి ఎందరో మహనీయులను అందించి కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేస్తోంది. భారతదేశంలోని సుప్రసిద్ధ విద్వాంసులు ఆకాశవాణిలో పని చేయడం విశేషం. డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ, యం. యస్. సుబ్బలక్ష్మి (ఎమిరిటస్ ప్రొడ్యూసర్) మంచాళ జగన్నాథరావు, వింజమూరి వరదరాజ అయ్యంగార్, N. S. శ్రీనివాసన్, వింజమూరి సీతాదేవి, ఓలేటి వెంకటేశ్వర్లు, సంధ్యావందనం శ్రీనివాసరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ యిలా ఎందరో ఆకాశవాణి కొత్త పుంతలు తొక్కడానికి మార్గదర్శకు లయ్యారు.