పుట:Prasarapramukulu022372mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

ప్రసార ప్రముఖులు.

ఎల్లా వెంకటేశ్వరరావు :

తనదైన ప్రత్యేక బాణీలో నవ మృదంగ సమ్మేళనం నిర్వహించి యావద్భారత ఖ్యాతిని గడించిన ఎల్లా వెంకటేశ్వరరావు విజయవాడలో జన్మించారు. వీరి తండ్రి ఎల్లా సోమన్న ప్రముఖ మృదంగ విద్వాంసులు. చిన్నతనంలోనే మృదంగ వాద్యాన్ని అభ్యసించారు ఎల్లా. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో తొలుత నిలయ కళాకారులుగా చేరారు. ఆ తర్వాత హైదరాబాదు కేంద్రంలో మృదంగ విద్వాంసులుగా సుమారు రెండు దశాబ్దాలు పనిచేశారు. 1961లో ఆకాశవాణి జాతీయ సంగీత పోటీల్లో ప్రథమ బహుమతిని డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి వద్దనుండి పొందారు.

దేశ విదేశాలలో ప్రదర్శనం ద్వారా ఖ్యాతి గడించారు. విదేశాలలో సుదీర్ఘకాలం పర్యటించి వారి ప్రశంస లందుకొన్నారు. ఎందరో శిష్యులను తయారు చేశారు. 24 గంటలపాటు అఖండ మృదంగ విన్యాసాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంవారు వీరిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. యావద్భారత దేశంలో వివిధ సంస్థలు వీరిని గౌరవించాయి. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ సంపాదించారు.

డా|| ఎల్లా వెంకటేశ్వరరావు హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం వారి సంగీత విభాగంలో ఆచార్యులుగా గత 8 సం||లుగా వ్యవహరిస్తున్నారు. సంగీత నృత్య విభాగానికి డీన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా, జపాన్, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా మొ|| దేశాలు పర్యటించారు.

విజయవాడ కేంద్రంలో సంగీత విభాగంలో పనిచేసిన ఎందరో ప్రముఖులు స్మరించదగ్గ వారున్నారు. సర్వశ్రీ క్రొవ్విడి హనుమంతరావు, క్రొవ్విడి సీతారాం, దత్తు వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ సింహాచలశాస్త్రి, రామవరపు సుబ్బారావు వంటి ప్రముఖులు పనిచేశారు.

ఈ తరానికి చెందినవారిలో సర్వశ్రీ అరిపోలు మురళీకృష్ణ (వయొలిన్), కె. వి. కృష్ణ (వేణువు), నాగరాజ్ (ప్లూట్), సుబ్రహ్మణ్యేశ్వరరావు (క్లారినెట్), బి. వి. యస్. ప్రసాద్, సతీష్, సద్గురు చరణ్ (మృదంగం), మల్లాది శ్రీరాం ప్రసాద్, మోదుమూడి సుధాకర్, కుమారి శిష్ట్లా శారద చెప్పుకోదగినవారు. M. S. బాబు, గోవాడ సుబ్బారావు హఠాన్మరణం పొందారు.