పుట:Prasarapramukulu022372mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

ప్రసార ప్రముఖులు.

అన్నవరపు రామస్వామి :

పారుపల్లి రామకృష్ణయ్య శిష్యులలో బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు ప్రసిద్ధులు. అన్నవరపు రామస్వామి 1926 ఆగష్టు 7న సోమవరప్పాడులో జన్మించారు. తండ్రి పెంటయ్య ప్రముఖ నాదస్వర విద్వాంసులు. అన్నయ్య అన్నవరపు గోపాలం మృదంగ విద్వాంసుడుగా చాలా కాలం ఆకాశవాణిలో కళాకారులుగా పనిచేసి పదవీ విరమణ చేసి మరణించారు.

ఐదు దశాబ్దాల కాలంలో రామస్వామి వాయులీన విద్వాంసులుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఆయన వయోలిన్ పై సహకరించని ప్రముఖ కళాకారులు లేరు. సహకార వాద్యంగానే గాక స్వతంత్రంగా కచేరీలు చేసి రసజ్ఞఉల మన్ననలు ఖండ ఖండాంతరాలలో పొందారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1948 నవంబరులో చేరారు. అప్పటి కింకా విజయవాడ కేంద్రం ప్రారంభం కాలేదు. N. S. రామచంద్రన్ గారు వీరిని, కృష్ణమాచార్యులను, దండమూడిని సెలక్టు చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. వీరు కళాకారులుగా 1986 వరకు పనిచేశారు. ఆయన యిప్పుడు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ వాద్యకారుడు.

అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూరు, మలేషియా, బెహరిన్, దుబాయ్, మస్కట్ వంటి అనేక దేశాలలో పర్యటించి కచేరీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ఫెలోగా ఎంపికయ్యారు. విజయవాడ, రాజమండ్రి, భీమవరాలలో కనకాభిషేకము, సువర్ణఘంటా కంకణం పొందారు. 1986 లో వీరి షష్టిపూర్తి మహోత్సవాలు వైభవంగా విజయవాడలో జరిపారు.

నాద సుధార్ణవ, వాయులీన కళాకౌముది, వాద్యరత్న, కళా సరస్వతి వంటి బిరుదులతో ఆంధ్రదేశం ఆయనను సత్కరించింది. గురుకుల పద్ధతిలో ఆయన వద్ద ఎందరో శిష్యులు విద్య నభ్యసించి ప్రసిద్ధులయ్యారు. గాత్రంలోను, వయొలిన్, వీణ, వేణువు, క్లారినెట్ వంటి కళలలో ఆయన వద్ద ఎందరో శిక్షణ పొందారు. అందులో ప్రపంచం సీతారాం ప్రముఖులు. ఆకాశవాణి డైరక్టర్ జనరల్ కార్యాలయంలో సంగిత విభాగం డైరెక్టర్ గా రెండేళ్లు పనిచేసిన సీతారాం వేణుగాన కళలో జగత్ప్రసిద్ధి పొందారు.