పుట:Prasarapramukulu022372mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

55

డా. లత

'లత' గా సాహితీలోకానికి సుపరిచితురాలైన హేమలత విజయవాడ సమీపంలోని నిమ్మలూరులో జన్మించారు. నవలా, కథా రచయిత్రిగా ఆమె ప్రఖ్యాతి గడించారు. 116 నవలలు వ్రాసి ఆనాటి యువతరాన్ని స్వేచ్ఛాప్రణయ గాథలలో ఉర్రూత లూగించారు. ' వంశీ ' కలం పేరుతో ఆమె కథలు, నవలలు వ్రాశారు. రేడియో నాటికలు, నాటకాలు, సాహిత్య వ్యాసాలు, కవితలు వ్రాశారు. ' లత సాహిత్యం ' ఆనాటి మధ్యతరగతి యువకుల్ని బాగా ప్రభావితం చేసింది. ఆమె స్వతంత్ర భావాలు భవిష్యద్దర్శనానికి ప్రతీకలు. తాను నమ్మినది నిర్భయంగా నిష్కర్షగా చెప్పగల, వ్రాయగల రచయిత్రిగా ఆమెకు పేరు.

1977లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారు ఆమెకు గౌరవ డాక్టరేట్ పట్టాతో సత్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయం 1996వ సంవత్సరంలో సాహితీ పురస్కారంతో సన్మానించింది. వంశీ విజ్ఞానపీఠం వారు లక్షరూపాయల విజ్ఞాన పురస్కారంతో ఆమెను గౌరవించారు.

చలాన్ని తలపించే ఆమె రచనలు ఒక్కొక్కసారి విశ్వనాథను కూడా ప్రశ్నించేవిగా వుండేవని జ్ఞానపీఠ బహుమతి గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి లత సాహిత్యం గురించి వ్యాఖ్యానించారు. ఆమె మోహన వంశీ నవలను చదివి ప్రజాహితమై వంశీ సాంస్కృతిక సంస్థను 25 సం.ల క్రితం స్థాపించారు. స్త్రీల సమస్యలను ఆధునిక భావాలతో పరిశీలనాదృష్టితో అధ్యయనం చేయటం లత సొత్తు అని డా. వాసిరెడ్డి సీతాదేవి ప్రశంసించారు. ఆకాశవాణిలో తనదంటూ ప్రత్యేకతను నిలుపుకున్న లత ఆధునికాంధ్ర సాహిత్యంలో మణిపూస.

తెన్నేటి హేమలత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ 1955 నుండి ఒక దశాబ్దికాలం అనౌన్సరుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. 58 వసంతాలు చూసిన లత విజయవాడలో స్థిరపడ్డారు. గోపీచంద్ అవార్డు, సుశీలా, నారాయణరెడ్డి అవార్డు, తిక్కన అవార్డు, గృహలక్ష్మీ స్వర్ణకంకణం (1963) ఆమె కీర్తి కిరీటంలో పొదిగిన మణులు. 1963లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి సభ్యురాలుగా నామినేట్ చేయబడి ఉపాధ్యక్షురాలుగా కొంతకాలం పనిచేసారు. బిలాస్‌పూర్ ఆంధ్ర సంఘంవారు గండపెండేరంతో లతను సత్కరించారు. స్వర్ణసీత, ప్రేమ రాహిత్యంలో స్త్రీ, రామాయణ విషవృక్ష ఖండనం లత రచనల్లో విశిష్టాలు.