పుట:Prasarapramukulu022372mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

49

G. V. కృష్ణారావు :

గనిని వెంకట కృష్ణారావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించారు. బక్కపలచటి శరీరం, ఆలొచనాత్మకమైన చూపులు, సునిశిత మేధ ఆయన లక్షణాలు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పట్టభద్రులై, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఎం. ఏ. పూర్తి చేశారు. కాశీలో వుండగా మార్క్స్ సిద్ధాంతాల ప్రభావం ఆయనపై పడింది. మార్క్స్ సిద్ధాంతాల జాడలో కావ్య జగత్తు అనే సాహిత్య గ్రంథం వ్రాశారు.

కారక్రమేణా యం. యన్. రాయ్ ఉద్యమ ప్రభావానికి లోనయ్యారు. విగ్రహవ్యావర్తిని అనే తాత్విక సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. నాగార్జునాచార్యుని -న్యవాదాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తల సరళిని కృష్ణారావు ఆకళింపు చేసుకొన్నారు. ప్లేటో ఆదర్శ రాజ్యాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వారికి తెలుగులోకి అనువదించారు.

జేగంటలు, కీలుబొమ్మలు, వరూధిని శివరాత్రి, యుగసంధ్య ఈయన ఇతర రచలు. బొమ్మ ఏడ్చింది, భిక్షా పాత్ర వంటి నాటికలు ఆదర్శ శిఖరాలు అనే పేరుతో సంపుటిగా వెలువరించారు. కీలుబొమ్మలు నవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. పాపికొండలు, రాగరేఖలు, జఘన సుందరి వీరి నవలల్లో ప్రసిద్ధాలు. గ్రామీణ జన జీవనాన్ని అద్దంపట్టే కథలు చైత్రరథం పేరుతో సంపుటిగా వేశారు. ఉదబిందువులు యితర రచనల సంపుటి. నవ్యతోరణం వేదవ్యాస సంపుటి ప్రకటించారు.

Studies in Kalapoornodayam" అనే సిద్ధాంత గ్రంథాన్ని పరిశోధనకు సమర్పించి Ph.D. పట్టా మదరాసు విశ్వ విద్యాలయం నుండి పొందారు. పింగళి సురనపై యిది యిప్పటికీ అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. తత్వవేత్త అయిన కాంట్ పరతత్వ వాదాన్ని ఆయన సునిశితంగా పరిశీలించారు.

పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా కృష్ణారావు సాహితీసేవ చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ 1963 నుండి ఒక దశాబ్దిపాటి ప్రసంగ శాఖలొ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఆంధ్ర విశ్వ విద్యాలయ పాలకవర్గ సభ్యుడుగా వ్యవహరించారు. 1978 ఆగష్టు 23న కృష్ణారావు పరమపదించారు.

నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణారావు.