Jump to content

పుట:Pranayamamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. 'శివయోగ దీపిక'ను రచించినవారు ప్రాణాయామమును మూడు రకములుగ వర్ణించిరి:

1. ప్రకృతి 2. వైకృతి 3. కేవల కుంభకము-అని.

"రేచక పూరకములు తమంత తామే, తమ సహజ రీతిని జరుగుచుండుటను ప్రకృత మందురు. శాస్త్రోక్త ప్రకారము రేచక పూరక కుంభక నియమములతో చేయునది కృతిమము గాన దానిని వైకృతి యందురు. ఈ రెండింటికి అతీతుడై రేచక పూరకములను ఆకస్మికముగ ఆపివేయ గలుగుటను కేవల కుంభకమందురు.

ప్రకృతి ప్రాణాయామము మంత్ర యోగమునకును, వైకృతి లయయోగమునకును సంబంధించినది!

35. శరీరము నిశ్చలముగా ప్రశాంతస్థితిలో వుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా వుండుటను కుంభకమందురు. ఇట్టి స్థితియందున్న వాని స్థితి వినుటయందు చెవిటివానివలెను, చూచుటలో గ్రుడ్డివానివలెను వుండును!

36. పతంజలి, ప్రాణాయామమును గురించి ఎక్కువ శ్రద్ద చూపలేదు. "రేచకమును, పూరకమును నెమ్మదిగా చేయుము. కొంతసేపు గాలిని కుంభించుము. ప్రశాంతమైన నిలుకడగల మనస్సుగలవాడ నగుదువు" అని చెప్పెను. హఠయోగులే దీని నొక ప్రత్యేక శాస్త్రముగ వృద్ధిచేసి, అందరకు అనుకూలముగ వుండునటుల రకరకములగు ప్రాణాయామములను సృష్టించిరి.

37. "పులి లేక జింక చర్మము, అదిన్నీ లేనిచో నాల్గు మడతలు వేసిన జంబుఖానాను పరచుము. దానిపై తెల్లని గుడ్డనుపరచి, ఉత్తరముఖము గలవాడవై, ప్రాణాయామము చేయుటకు కూర్చొనుము."