Jump to content

పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కెంత తంటాలుపడినను స్వామిమూర్తి దర్శనము లభింపలేదు. మద్రాసు నుండి మహంతుగారికి, వారిదగ్గఱ నుండి కొండమీది యుద్యోగులకు జాబు గొని వెళ్ళితిమి. కాన యక్కడ వలయు సౌకర్యములు లభించెను. మా వారందఱు కొంత యలజడి, త్రొక్కట మును జెందినను స్వామి దర్శనము ససిగాఁ జేసికొని తనిసిరి. నేను చాలసేపు స్వామి మూర్తిని చూడ యత్నించి విఫలమనోరధుఁ డ నయితిని. ఎంత యత్నించినను చెదరి చీకటి గానవచ్చెను కాని నా కక్కడ స్వామి మూర్తి గోచరింపదయ్యెను. చాల నిరుత్సాహముచెందితిని. దౌర్బల్యముచే నక్కడి మూర్తి దర్శనమునాకు కనులు మిఱుమిట్లు గొనియుండు నని, స్వామికి నాకు నడుమ దివ్వె వెలుఁ గుండుటచే నది యడ్డు వచ్చి మూర్తినిగానరానియా దయ్యెనని నా పాపకర్మముచే దర్శనము లభింపలేదని పరిపరి యోచనలు, వాని కేవో యాపవాదములు తోఁచ సాగెను. ఏమి తోఁచినను స్వామి గోచరింపఁ డయ్యెనే కదా యన్న యారాటము నన్ను వీడలేదు.

ఈసందర్భ మీగ్రంధము రచించునాఁటి కించుమించుగా నల్వదియేండ్లకు పూర్వము జరిగినది. 1910 వ సంవత్సరము నాఁ టి దీ వృత్తాంతము. తర్వాత 1930 నుండి తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ని గూర్చి కొంత యెఱుక నాకుఁ గలుగ సాగెను. 1949 నాఁ టి కింకనెన్నో విషయములు గోచరింపచెను. వాణి నాయాసందర్భములలో సక్రమముగా వివరింతును.