పుట:Prabodhanandam Natikalu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రైస్తవుడు  :- మా దేవుడు అందరి పాపములను క్షమిస్తానని చెప్పలేదు. ప్రభువును నమ్మినవారికి మాత్రమే క్షమాపణ కలదు.

హిందువు  :- ఆ మాట చెప్పి మా హిందువులనందరిని మీ మతము లోనికి లాగుకొనుచున్నారు.

క్రైస్తవుడు  :- మేము చెప్పే మాటకాదు. మీ హిందూమతములోని వేదములలోనే పాపక్షమాపణ నిమిత్తము రక్తమును చిందించడము అను మాటవుంది. అలా పాపక్షమాపణ నిమిత్తము రక్తమును చిందించినవాడు మా ప్రభువు ఒక్కడే గలడు. మీ నాలుగు వేదములలో సామవేదమున రెండవ భాగమైన తాండియా మహాబ్రాహ్మణమందు శ్లో॥ ‘‘ప్రజా ప్రతిర్థే వేభ్యం ఆత్మనా యజ్ఞం కృత్వాప్రాయశ్చిత్‌’’ అని వుంది. దీని భావము ఏమనగా! ప్రజలను పరిపాలించువాడు, ప్రజల పాపపరిహారార్థము తన స్వంత శరీరమును ప్రాయశ్చిత్తముగా నలుగగొట్టుకొని యజ్ఞము చేయును. ప్రజాపతి అనగా దేవుడు అని అర్థము. ఈ శ్లోకము ప్రకారము ప్రభువు ప్రజల పాపపరిహారార్థము తన స్వంత శరీరమునే బలి ఇచ్చాడు. అందువలన మీ వేదముల ప్రకారము మా దేవుడే నిజమైన దేవుడు.

హిందువు  :- మీరు మా వేలే తీసుకొని మా కన్నే పొడిచినట్లు, మా వేదాలే తీసుకొని మా దేవుణ్ణే కాదంటున్నారు. మా వేదాలలోని మీకు అనుకూల మైన మాటలను చెప్పుకొంటున్నారు. మీ బైబిలులో మా దేవుణ్ణి సమర్థించే మాటలుకూడ ఉన్నాయి. మీరు నడుచు విధానము తప్పు అని చెప్పు వాక్యములు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటిని మేము కూడ చెప్పగలము.

క్రైస్తవుడు  :- ఎక్కడున్నాయో చెప్పు చూస్తాము.

హిందువు  :- మీ బైబిలులోనే ఉన్నాయి. పలానా చోట అని చెప్పలేను. ఒక్క మారే చదివాను. అందువలన అవి సరిగ జ్ఞప్తికిలేవు.