Jump to content

పుట:Prabodhanandam Natikalu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలా అనడమునుబట్టి వారు ముగ్గురు మూడు మతాలకు చెందినవారని తెలియుచున్నది. వారు ముగ్గురు ఒకచోట కూర్చొని సేద తీర్చుకుంటూ మాట్లాడుకొంటున్నారు.


హిందువు :- మన ముగ్గురికి జలుబు చేసింది. ముగ్గురికి తుమ్ములు వస్తున్నాయి. నేను తుమ్మినపుడు రామా అంటున్నాను. మీరు ఇద్దరు మొదట హిందూమతములో వుండి, ఇతర మతములలోనికి పోయారు. మతమంటే మార్చుకున్నారు. చివరకు తుమ్మినపుడు కూడ దేవున్ని మార్చి ఒకరు ప్రభు అని, మరొకరు అల్లా అనుచున్నారు. మతము మారిపోతే దేవున్ని కూడ మార్చవచ్చునా?

ముస్లీమ్‌ :- నేను మొదట హిందూమతములోవుండి హిందూమతము కంటే ఇస్లామ్‌మతము గొప్పదని దానిని వదిలివచ్చాను. ఇస్లామ్‌ ధర్మము ప్రకారము మాకు దేవుడు ఒక్కడే. అందువలన మేము అల్లా అనుచున్నాము.

క్రైస్తవుడు :- నేను కూడ మొదట హిందూమతములోని వాడినే. ఆ మతములో 33 కోట్లమంది దేవుళ్ళున్నారు. అందులో ఎవరు నిజమైన దేవుడో చెప్పేదానికే వీలులేదు. క్రైస్తవములో ప్రభువును మించిన దేవుడు లేడని తెలిసిన దానివలన నేను క్రైస్తవుడయినాను. ప్రభువువే దేవుడని అందరికి తెలియుటకు తుమ్మినపుడు కూడ ప్రభూ అంటున్నాను.

హిందువు :- ఒకరికి అల్లా, ఒకరికి ప్రభు, నాకేమో రాముడు, మీకంటే నేనే మేలు. త్రేతాయుగమునాటి రామున్ని పట్టుకొన్నాను. మీరు కలియుగ ములోని వారిని పట్టుకొన్నారు. కలియుగముకంటే ముందు మీరు చెప్పే పేర్లు లేవు కదా! కాబట్టి ముందు నుంచివున్న రాముణ్ణి పట్టుకొన్న నేనే మేలు.