పుట:Peddapurasamstanacheritram (1915).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లను, రెడ్డినాయకులను జయించుటదుస్తరంగుట చేతనో, మతాంతరులైనతురుష్కుల సాహాయ్యమపేక్షించుట దేశద్రోహమగు నన్న తలంపుచేతనో గాని కళింగోత్కల దేశాధీశ్వరు లగుగజపతుల సహాయమునుబొంది, కపిలేశ్వరగజపతిరాయలకాలమున బశ్చిమమున నోరుగల్లువరకును, దక్షిణమున గాంచీపురమువరకును జయించిరి. వత్సవాయవారు, సాగివారు, పూసపాటివారు, మందపాటివారు, దంతులూరివారు, దాట్లవారు, గణపతిరాజువారు మొదలుగాగల సుప్రసిద్ధులగు రాచవారనేకులు గజపతులక్రింద సర్వాధికారములను వహించి ప్రబలులైరి. ఆంధ్రదేశమునందున్న క్షత్రియులందరు తమయనుపమాన శౌర్యసాహసములను ప్రకటించినకాల మిదియే !

క్రీ.శ. 1461వ సంవత్సరములో బహమనీరాజైన అహమ్మదుషా త్రిలింగదేశపురాజులను జయించి ఓరుగల్లుపట్టణమును వశపరచుకొనియెను. కాని 1440వ సంవత్సరములో గళింగదేశపురాజును, కపిలేంద్రజగపతిమహారాయల కుమారుడును నగు ఉర్బరదేశకుమారమహాపాత్రుడును, పరశురామతనయుడును నగు వీరభద్రరాజును గలిసి ఏకశిలానగరముపై దండెత్తివచ్చి, మహమ్మదీయులనచ్చటినుండి పారద్రోలి, ఓరుగల్లును మరల స్వాధీనము చేసికొన్నట్ట్లు, అచ్చటివారిశాసనములవలన బోధపడుచున్నది. 1471వ సంవత్సరములో గజపతులకు సామంతులుగానున్న మండలేశ్వరులన్యోన్యవైషమ్యములను బెంచికొని,తమలోదాముపోరాడుచుంటనుజూచి, కొండపల్లి రాజమహేంద్రవరదుర్గములను, దత్ప్రాంత ప్రదేశములను దనరాజ్యములో జేర్చికొనుటకై సంకల్పించి, విఫలమనోరధడయ్యెను. తరువాత కపిలేంద్రగజపతి మరణము నొందగా పురుషోత్తమగజపతిమహారాయలు సింహాసనమునకువచ్చెను. అందును గూర్చి యతనికిని, నతనిదాయాదికిని వివాదముపొసగి, యాదాయాది మహమ్మనీయులసాహాయ్యమును గోరెను. అప్పుడు బహమనీరా జైన రెండవమహమ్మదుషా యదివరకే గజపతుల రాజ్యము నపహరింపవలెనను పేరాసతో నున్నవాడగుటచేత మిక్కిలిసంతోషించి, యాపని నిర్వహించుటకై, మల్లిక్-ఉల్-ముల్క్ అను బిరుదము నొసంగెను. ఈబిరుదమే తరువాత మహమ్మదీయుల బిరుదములలో మిక్కిలి ప్రఖ్యాతివహించినదయ్యెను. ఈనిజామ్-ఉల్క్-ముల్క్ మొదట హిందువుగానుండి, బాల్యములో మహమ్మదీయులచే జెరగొనిపోబడి యంతపురమున రాజునకు సహవాసిగా నియమింపబడి మహమ్మదీయమతావలంబకుడై, బహమనీరాజ యొక్క దయకుబాత్రుడై,యిభివృద్ధిగాంచి, ప్రఖ్యాతికెక్కినవాడుగానుండెను. తరువాత నితడు గజపతులరాజ్యముపైకి దండె