Jump to content

పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

పండ్రెండురాజుల కథ.


మోక్షదాయకమో యోగినీవ్రుత్తియే పరలోక సాధకమో, తోపక నాడెందం బాందోళనమందుచున్నయది. గిరి శిఖరంబున వెలసిన ఋషి వార్త తండ్రిగారు చెప్పఁగా, నీవును వింటివిగదా! ఆయన సమర్థుడని తోఁచుచున్నది. అటకరిగి మన సందియముందీర్చుకోందమా?" యని యడుగ, నామెయు వల్లేయని యామఱునాడు వేకువజామున నటకు బయనించి సావిత్రింగొనిపోయెను. గిరికందరమునఁ దొలుత వారికి యోగిని దర్శనంబిచ్చి—— వారు వచ్చిన కార్యంబు నాకర్ణించి, యోగీం ద్రులలో మనవి చేసివత్తునని బయటి మందిరమున వారినునిచి, తాను లోనికరిగి, కొండొకవడికి బయటకువచ్చి “రాజపుత్రీ! నీభాగ్యమసమానమైనది సుమా! స్వాములవారు, సహజముగా, స్త్రీలనిన విరక్తులగు స్వభావముగలవారు. నాచిత్తశుద్ధి నెటీంగినవారగుట నన్నొక్కతెను మాత్రమే, శిష్యురాలిగా, నంగీకరించినారు. నన్నైనను విశేషకాలము దరినుండనీయరు. నూఱు ప్రశ్నలకొక్క యుత్తరమిచ్చుట యసాధ్యము, నీ పురాకృత పుణ్యం బెట్టిదియో కాని, నీ పేరు చెప్పినంతనే, వికశిత ముఖారవిందులై——నీ సద్గుణ సహస్రంబును, చూచినట్లే, పెద్దగాస్తుతించిరి! నీ భాగ్యముపండినది నాతో రమ్మని పలికి, యప్పుడే సావిత్రి నాయతి సన్నిధికిఁ గొనిపోయెను.—— ఆయతి యతిమాత్ర తేజశ్శాలియై—— భూమి నవతరించిన మన్మధుండోయన నొప్పారుచు—— పురుషుల పేరు చెప్పిననేవగించుకొను సావిత్రికి లజ్జావిభ్రమములం గలిగించెను. యోగి యాబాలిక ప్రణామంబులను స్వీకరించి, మెల్లన నామెచేయినెత్తి ముద్దిడి, "రాజకుమారీ! నీజనకుని రత్నహారమును మాతపశ్శక్తిచే దెప్పించితిమి. ఇదే హారము! మఱియొకనాడు నీకొసంగుదముగాక!" యని యాహారము నామెకుఁజూపి, మఱలగైకొని యానాటికా బాలకు సెలవొసంగెను. రత్నహారవక్షణమున, సావిత్రీ మంజరులకా మహాత్ముని యందు, దృఢ విశ్వాసము నాటుకొనెను. మఱునాడు తప్పక తమ సంశయములం, దీర్చుకొనవలయునని, వేఁగుజాముననే సావిత్రియు మంజరియు మఱల గిరిశిఖరంబునకరగి, యోగినికిఁ దమహృదయాభి