పుట:PadabhamdhaParijathamu.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

పరస్పరభావవినిమయం ప్రధానలక్ష్యంగా ఏర్పడిన భాష నానాటికీ పదునుదేరుతూ వస్తుంది. అవసర మేర్పడిన ట్లెల్లా, ఆసక్తి పెంపొందినట్లెల్లా, మానవవిజ్ఞానం వికసించిన ట్లెల్లా, మనసూ మేధా నేవళం తేరిన ట్లెల్లా, మనసూ మేధా నేవళం తేలిన ట్లెల్లా భాషలో మార్పులూ, చేర్పులూ, కూర్పులూ అనంతంగా వర్ధిల్లడం అనూచానంగా వస్తున్నది.

తన మనోభావాల నన్నింటినీ తోడివారికి చెప్పుకొనగలచేవ తన భాషకు సంతరించుకొనడంలో ప్రతి మనిషీ, ప్రతి కాలంలోనూ ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో ఎంతో కొంత కృషి చేస్తూనే వుంటాడు. తత్ఫలితంగా ఒకనాటికంటె మఱొకనాడు భాషలో కొత్తమాటలూ, కొత్త మాటలతేటలూ, మాటలు కొత్తవి కానప్పుడు వానికే కొంగ్రొత్త భావచ్చాయలూ ఏర్పడుతూ వస్తున్నవి.

సామాన్యంగా విడివిడిగా పొడి మాటలుగా ఉన్నవే. అపూర్వసమ్మేళనంతో - ఆ మాటలకు విడివిడిగా వేనికీ లేని ఏదో ఒక అపూర్వభావవ్యక్తీకరణకు మూలములై - విశిష్ట పదబంధాలుగా భాషలో నిలిచిపోతున్నవి.

వానినే పదబంధము లనీ, నుడికారము లనీ, పలుకు బడు లనీ, జాతీయము లనీ పేర్కొంటూ ఉంటాము. ఇవే కవితాలతాంకుర ప్రథమాలవాలా లనీ విజ్ఞులు భావిస్తారు.

మాటకు 'కళ్ళలో కారం పోసుకొను' అన్న పలుకుబడి తీసుకుందాం. ఇందులో మూడు మాటల చేరికవాని విడివిడి అర్థాలకు వేనికీ చెందని అసూయాగ్రస్తతను వెలనాడుతున్నది.

‘కాస్త పచ్చగా కనిపిస్తే సరి అది కళ్ళలో కారం పోసుకుంటుంది.’