పుట:Oka-Yogi-Atmakatha.pdf/783

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 44

గాంధీమహాత్ములతో వార్ధాలో

“వార్ధాలో మీకు స్వాగతం!” గాంధీమహాత్ముల కార్యదర్శి, మహాదేవ దేశాయి, మిస్ బ్లెట్ష్‌కూ శ్రీ రైట్‌కూ నాకూ సౌహార్దంతో నిండిన ఈ మాటలతో స్వాగతం చెబుతూ ఖద్దరు మాలలు వేశారు. మా చిన్న బృందం, ఆగస్టులో ఒకనాడు వేకువజామున, అప్పుడే వార్ధా స్టేషనులో దిగింది. బండిలో ఉన్న దుమ్ములోంచీ ఉక్కపోతలోంచి బయటపడ్డందుకు మేము సంతోషించాం. మా సామాను ఒక ఎద్దుబండిలో వేయించి శ్రీ దేశాయితోనూ ఆయన వెంట వచ్చిన బాబా సాహెబ్ దేశ్ ముఖ్ , డా॥ పింగళే గార్లతో కలిసి మేము, ఒక తెరిపి మోటారుకారులో బయలుదేరాం. బురద గొట్టుకుపోయిన నాటురోడ్ల మీద కొంతసేపు ప్రయాణంచేసి “మగన్ వాడి” చేరాం; భారతదేశ రాజకీయ ఋషి ఆశ్రమమది.

దేశాయిగారు మమ్మల్ని వెంటనే ‘రాతగది’లోకి తీసుకువెళ్ళారు; అక్కడ గాంధీమహాత్ములు బాసెంపట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు. ఒక చేతిలో కలం, మరో చేతిలో ఒక కాయితం ముక్క; ఆయన ముఖంలో హృదయాకర్షకమైన మధుర మందహాసం!

“స్వాగతం!” అని హిందీలో రాశారాయన; ఆరోజు సోమవారం; వారానికోసారిగా ఆయన మౌనం పాటించే రోజు అది.

మేము కలుసుకోడం అదే మొదటిసారి అయినా, మేము ఒకరి నొకరం ఆప్యాయంగా, చూసుకున్నాం. గాంధీమహాత్ములు 1925 లో